న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ గురువారం ప్రజలకు మరిన్నిఉపశమన చర్యల్ని ప్రకటించింది. ముఖ్యంగా పెళ్ళిళ్ల సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు, రైతులకు కేంద్ర నిర్ణయం ఊరటనిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ గురువారం ఉదయం ఆర్థిక శాఖ తీసుకున్న చర్యలను మీడియా సమావేశంలో వివరించారు. ఈ సందర్బంగా కొన్ని వెసులు బాట్లను, మరిన్ని మార్పులను వెల్లడించారు. అయితే రద్దు చేసిన రూ. 500, రూ.1000 నోట్లను మార్చుకునే పరిమితిని రూ.4,500 నుంచి రూ.2,000కు తగ్గిస్తున్నట్టు వెల్లడించారు.
మరింత మందికి పాత నోట్లను మార్చుకునే అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. నగదు మార్పిడిలో ఈ కొత్త నిబంధన రేపటినుంచి(నవంబరు 18) అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అలాగే పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా వివిధ వర్గాలనుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఆయా కుటుంబాల నగదు విత్ డ్రా పరిమితిని పెంచుతున్నామన్నారు. గుర్తింపు కార్డు చూపి (సెల్ఫ్ డిక్లరేషన్ల ) రూ.2.5 లక్ష రూపాయలు విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు.
అలాగే రైతులు రుణ బీమా ప్రీమియం చెల్లింపుల గడువును 15 రోజుల పెంచారు. ఇందుకోసం ఆయా రైతులు కెవైసీ వివరాలు అందించాలి. పంటరుణాలు పొందిన రైతులు వారానికి 25 వేలు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కిసాన్ క్రెడిట్ దారులకూ ఇదే పరిమితి వర్తింస్తుందని తెలిపారు. ఏపీఎంసీ మార్కెట్ లో రిజిస్టర్ అయిన వ్యాపార్లు 50 వేలకు డ్రా చేసుకునే అవకాశం.
ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు (అప్ టూ గ్రూప్ సీ...ఉద్యోగులు) సాలరీ అడ్వాన్స్ కింద 10 వేలకు డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని ప్రకటించారు. హాస్పిటల్ గురించి ప్రశ్నించినపుడు.. నిర్ణయం తీసుకున్న తరువాత వివరాలు వెల్లడిస్తామని శక్తికాంత్ దాస్ చెప్పారు.
మరోవైపు నగదు అందుబాటులో లేనందువల్లే మార్పిడి కుదింపు నిర్ణయం తీసుకన్నారా అని ప్రశ్నించినపుడు ఈ వాదనను ఆయన కొట్టి పారేశారు. ప్రభుత్వం వద్ద నగదు చాలినంత అందుబాటులోఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.