మంత్రి గంటా ఆస్తుల స్వాధీనం!

31 Dec, 2016 01:14 IST|Sakshi
మంత్రి గంటా ఆస్తుల స్వాధీనం!

- విశాఖలోని ఇండియన్‌ బ్యాంకుకు ’గంటా’ గ్యాంగ్‌ ఎగనామం
- రుణ బకాయిలు చెల్లించని ప్రత్యూష కంపెనీ
- వడ్డీతో కలిపి రూ.196.51 కోట్ల బకాయి
- డిమాండ్‌ నోటీసులిచ్చినా స్పందన శూన్యం
- కంపెనీతోసహా డైరెక్టర్ల ఆస్తులు, హామీదారుగా ఉన్న గంటా ఆస్తుల స్వాధీనానికి ప్రకటన  

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు బంధువులు, వ్యాపార భాగస్వాములు రుణ ఎగవేతదారులుగా ముద్రపడ్డారు. ఇక్కడి ఇండియన్‌ బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేదు. దీంతో వారిని రుణ ఎగవేతదారులుగా పరిగణించిన బ్యాంకు అధికారులు ఆస్తుల స్వాధీనానికి నోటీసులు, పత్రికా ప్రకటనలు జారీ చేశారు. తీసుకున్న రుణాల్ని వడ్డీతోసహా చెల్లించాలని బ్యాంకు పలుమార్లు డిమాండ్‌ నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో.. చివరి అస్త్రంగా  వారు హామీగా పెట్టిన ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్టు బ్యాంకు బుధవారం పత్రికా ప్రకటనలు జారీ చేసింది. ఇందులో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులు కూడా ఉండడం కలకలం రేపుతోంది.

వడ్డీతో కలిపి రూ.196.50 కోట్లు
విశాఖపట్నం వన్‌టౌన్‌లో ఉన్న ప్రత్యూష రిసోర్సెస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 2005 ఆగస్టు 18న కంపెనీల చట్టం కింద రిజిస్టర్‌(రిజిస్ట్రేషన్‌ నం.047165) అయ్యింది. మాన్యుఫ్యాక్చరింగ్, మిషనరీ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ కార్యకలాపాలకు ఉద్దేశించిన ఈ సంస్థ.. రూ.500 కోట్ల ఆథరైజ్డ్‌ క్యాపిటల్, రూ.240.671 కోట్ల పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌తో ఏర్పాటైంది. ఈ సంస్థకు యాక్టివ్‌ డైరెక్టర్లుగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తోడల్లుడు పరుచూరి వెంకట భాస్కరరావు, ఆయన సోదరులు రాజారావు, వెంకయ్య ప్రభాకరరావు వ్యవహరిస్తున్నారు.  మంత్రి గంటాతోపాటు కొండయ్య, బాలసుబ్రహ్మణ్యం, నార్నె అమూల్యలతోపాటు ప్రత్యూష ఎస్టేట్స్‌ ప్రైవేటు లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్‌ ట్రేడ్‌ ప్రైవేటు లిమిటెడ్‌లు ప్రధాన హామీదారులుగా ఉన్నారు. సంస్థ విస్తరణ పేరుతో విశాఖలోని ఇండియన్‌ బ్యాంక్‌ డాబాగార్డెన్స్‌ శాఖ నుంచి రూ.141,68, 07,584 రుణం తీసుకున్నారు. అయితే ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. ఫలితంగా  ఈ ఏడాది డిసెంబర్‌ 13 నాటికి వడ్డీతో కలిపి వారు చెల్లించాల్సిన రుణ బకాయి మొత్తం రూ.196,51,00,717గా ఇండియన్‌ బ్యాంకు లెక్కకట్టింది.

అక్టోబర్‌ 4నే డిమాండ్‌ నోటీసులు
ఈ మొత్తాన్ని చెల్లించాలంటూ గత అక్టోబర్‌ 4న బ్యాంకు డిమాండ్‌ నోటీసు జారీ చేసింది. నోటీసందిన 60 రోజుల్లోగా రుణబకాయి చెల్లించాలని, లేకుంటే కంపెనీతోపాటు డైరెక్టర్లు, హామీదారుల ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అందులో స్పష్టం చేసింది. అయినప్పటికీ సంస్థ ఒక్క రూపాయీ చెల్లించలేదు. దీంతో ఆస్తుల స్వాధీనానికి బ్యాంకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రత్యూష కంపెనీకి చెందిన ఆస్తులు, డైరెక్టర్లుగా ఉన్న పరుచూరి వెంకటభాస్కరరావు, రాజారావు, వెంకయ్య ప్రభాకరరావుల ఆస్తులతోపాటుగా హామీదారులుగా ఉన్న మంత్రి గంటా శ్రీనివాసరావు, కేబీ సుబ్రహ్మణ్యం, అమూల్యల ఆస్తులనూ స్వాధీనం చేసుకుంటున్నామంటూ బ్యాంక్‌ స్వాధీనత ప్రకటన జారీచేసింది. వివిధ ప్రాంతాల్లో ఉన్న వీరి ఆస్తులను ఈ నెల 21 నుంచి 26వ తేదీ మధ్య స్వాధీనం చేసుకున్నట్టుగా బ్యాంక్‌ అధికారులు ప్రకటించారు. విశాఖ నగరంతోపాటు గాజువాక, చినగదిలి, రుషికొండ, మధురవాడ, ఆనందపురం, అనకాపల్లి, కాకినాడల్లోని ప్రత్యూష కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల విషయంలో ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని, లావాదేవీలు జరిపినవారు ఈ రుణ బకాయిలకు బాధ్యులవుతారని హెచ్చరికలు జారీచేసింది.

ప్రత్యూష డైరెక్టర్లలో గంటా ఒకరు
పోర్టులో వ్యాపార లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన ఈ కంపెనీలో మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా డైరెక్టర్‌గా కొంతకాలం కొనసాగారు. ఈ సంస్థకే జిల్లా గ్రంథాలయసంస్థ నిర్మాణ బాధ్యతలు అప్పగించగా.. ఎమ్మెల్సీ ఎంవీఎస్‌ మూర్తి చేపట్టిన ఉద్యమంతో ప్రభుత్వం వెనక్కి తగ్గడం తెలిసిందే. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకే గత నెలలో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఇలాంటి కంపెనీ ఇండియన్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని ఎగవేయడం, హామీదారులుగా ఉన్న గంటాతోపాటు ఆయన బంధువులైన డైరెక్టర్ల ఆస్తుల్నీ స్వాధీనం చేసుకుంటున్నట్టుగా ప్రకటన జారీకావడం సంచలనం రేకెత్తించింది.

గ్యారంటీర్‌నే గానీ.. డిఫాల్టర్‌ను కాను
ప్రత్యూష కంపెనీలో ఒకప్పుడు నేను డైరెక్టర్‌గా వ్యవహరించిన మాట వాస్తవమే. కానీ ప్రస్తుతం ఆ కంపెనీతో నాకెలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. ఆ కంపెనీ ఇండియన్‌ బ్యాంకులో తీసుకున్న రుణాలకు గ్యారంటీర్‌గా ఉన్నాను. రుణ బకాయిలు చెల్లిం చకపోవడంతో కంపెనీ డైరెక్టర్లతోపాటు గ్యారం టర్‌గా ఉన్న నాకు కూడా నోటీసులిచ్చారు. రుణ బకాయిS చెల్లింపుల విషయంలో డైరెక్టర్లతో మాట్లాడతా.. బకాయిలు చెల్లించాలని కోరతా.
    – సాక్షితో గంటా శ్రీనివాసరావు, ఏపీ మంత్రి