మిషన్ ‘స్వచ్ఛ గ్రామీణ్ భారత్’

22 Aug, 2015 01:30 IST|Sakshi
మిషన్ ‘స్వచ్ఛ గ్రామీణ్ భారత్’

* రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మరుగుదొడ్ల నిర్మాణమే లక్ష్యం
* నాలుగేళ్లలో రూ. 3,661 కోట్లు ఖర్చు చేయనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
* మార్గదర్శకాలను సిద్ధం చేసిన ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్ విభాగం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా మార్చేందుకు ‘స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్)’ కార్యక్రమానికి సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి 75 శాతం నిధులు అందనుండగా, మిగిలిన 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బేస్‌లైన్ సర్వేను నిర్వహించిన గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య (ఆర్‌డబ్ల్యూఎస్‌ఎస్) విభాగం అధికారులు కార్యక్రమ అమలుకు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. గ్రామీణ తెలంగాణలో మొత్తం 45 లక్షల కుటుంబాలు ఉండగా ఇందులో సుమారు 33.34 లక్ష ల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని తేలింది. ఇందులో సుమారు 29.29 లక్షల పేద కుటుంబాలు ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.

వీరికి వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టించుకునేందుకు యూనిట్‌కు రూ. 12,500 చొప్పున ప్రోత్సాహకాలను అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వచ్చే నాలుగేళ్లలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 3,671 కోట్లు ఖర్చు చేయనున్నాయి. ఆయా గ్రామాల్లో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణాన్ని సంపూర్ణంగా ప్రజల భాగస్వామ్యంతోనే పూర్తిచేయాలని సర్కారు నిర్ణయించింది.
 
మార్గదర్శకాలు ఇలా..
* అన్ని గ్రామ పంచాయతీల్లో ఒక ఉప కమిటీగా గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈ కమిటీకి గ్రామ సర్పంచ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. కమిటీలో గ్రామంలోని ప్రతి వార్డు నుంచి ప్రాతినిధ్యం ఉండాలి. 50 శాతం మంది పేద మహిళలను సభ్యులుగా నియమించాలి.
* జిల్లా కమిటీ నుంచి నేరుగా సొమ్మును జమ చేసే విధంగా ప్రతి గ్రామ కమిటీకి బ్యాంకు ఖాతాను తెర వాలి.
* గ్రామ కమిటీ ద్వారా మరోమారు గ్రామంలో సర్వే చేసి మరుగుదొడ్లు లేని పేద కుటుంబాల జాబితాకు గ్రామ సభ ఆమోదం తీసుకోవాలి.
* నిధుల మంజూరు నిమిత్తం గ్రామసభ ఆమోదించిన జాబితాను మండల పరిషత్ అభివృద్ధి అధికారికి సమర్పించాలి. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల ద్వారా జిల్లా కలెక్టర్ ఆమోదం కూడా పొందాక గ్రామ కమిటీ ఖాతాలకు నిధులు జమ అవుతాయి.
* గ్రామంలో వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శి, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, గ్రామసమాఖ్య సభ్యులు, సాక్షర భారతి వాలంటీర్ల సాయం తీసుకోవాలి.
* మరుగుదొడ్ల నిర్మాణానికి అవసరమైన వ్యయంలో 50 శాతం నిధులు ఖాతాలో సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టాలి.
* లబ్ధిదారులు తామే సొంతంగా మరుగుదొడ్లను నిర్మించుకునేలా ప్రోత్సహించాలి. ఇందుకవసరమయ్యే నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే జమ చేయాలి.
* లబ్ధిదారులు సొంతంగా నిర్మించుకోలేకుం టే గ్రామ నీటి, పారిశుద్ధ్య కమిటీ ఆధ్వర్యంలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టాలి.

మరిన్ని వార్తలు