నటి వేధింపుల కేసు: 'మేడం' ఆమెనే

30 Aug, 2017 14:13 IST|Sakshi
నటి వేధింపుల కేసు: 'మేడం' ఆమెనే

సాక్షి, కోచి: ప్రముఖ మలయాళ నటిపై కారులో లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడైన పల్సర్‌ సునీ తాజాగా కీలక విషయాలు వెల్లడించాడు. 'నా మేడం ఎవరో కాదు కావ్యామాధవనే' అంటూ వెల్లడించాడు. అయితే, నటిపై లైంగిక వేధింపుల కేసు వెనుక ఆమె ప్రమేయం ఉందా? అన్న ప్రశ్నకు అతను 'లేదు' అని సమాధానం చెప్పాడు.

నటిపై లైంగిక వేధింపుల కేసులో కావ్యా మాధవన్‌ ప్రమేయం కూడా ఉన్నట్టు కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. 'మేడం' నుంచి అందిన ఆదేశాల మేరకే నటిని కారులో అపహరించి.. లైంగికంగా వేధించామని, ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీశామని పల్సర్‌ సునీ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. తనకు ఆదేశాలు ఇచ్చిన ఈ 'మేడం' సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తేనని అతను చెప్పాడు. ఈ కిరాతకమైన నేరానికి పాల్పడేందుకు డబ్బు సమకూర్చింది కూడా సదరు 'మేడమే'నని వివరించాడు. అయితే, డబ్బు సమకూర్చడం తప్ప ఆమె పెద్దగా నేరంలో పాల్గొనలేదని విచారణలో పల్సన్‌ సునీ గతంలో పోలీసులకు చెప్పాడు. తాజాగా ఆ మేడం ఎవరో వెల్లడించిన పల్సర్‌ సునీ.. అయితే, ఆమెకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని చెప్తుండటం గమనార్హం.

ప్రముఖ మాలయళ హీరో దిలీప్‌ రెండో భార్య అయిన కావ్యా మాధవన్‌కు కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నట్టు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకునేందుకే హీరో దిలీప్‌.. పల్సర్‌ సునీతో ఆమెపై ఈ అఘాయిత్యాన్ని చేయించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన రెండో భార్య కావ్య పాత్రపై కూడా అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఈ కేసులో రెండోసారి అభ్యర్థించినా నటుడు దిలీప్‌కు కేరళ హైకోర్టు బెయిల్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు