నితీష్ కుట్రను బయటపెడ్తా: లాలూ

25 Feb, 2014 15:55 IST|Sakshi
నితీష్ కుట్రను బయటపెడ్తా: లాలూ

పాట్నా: తమ పార్టీని చీల్చేందుకు బీహార్ సీఎం నితీష్ కుమార్ కుట్రచేశారని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్‌ ఆరోపించారు. మైనారిటీలో ఉన్న తన ప్రభుత్వాన్న కాపాడుకునేందుకు నితీష్ తమ పార్టీ ఎమ్మెల్యేలపై కన్నేశారని పేర్కొన్నారు. తమ ఎమ్మెల్యేలకు పదవులు ఆశ చూపి ఆర్జేడీని చీల్చేందుకు కుట్ర చేశారని అన్నారు. ఇందులో అసెంబ్లీ స్పీకర్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. నితీష్ కుట్రను బట్టబయలు చేస్తామని ప్రకటించారు.

అయితే తిరుగుబావుటా ఎగురువేసిన వారిలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆర్జేడీలోకి తిరిగి వచ్చారు. దీంతో వెనక్కి వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య 9కి పెరిగింది. ఈ రోజు లాలూ నివాసంలో జరిగిన ఆర్జేడీ లెజిస్లేటర్ల సమావేశానికి మొత్తం 16 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది నిన్న తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అయితే అత్యంత నాటకీయంగా వారిలో ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ తర్వాత కొద్దిసేపటికే తాము వేరుకుంపటి వర్గంలో లేమని స్పష్టం చేశారు. లాలూ ఆరోపణలను నితీష్ తోసిపుచ్చారు. ఆర్జేడీ ఎమ్మెల్యేలు జేడీ(యూ)లోకి వస్తే స్వాగతిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు