మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

19 Jan, 2017 18:04 IST|Sakshi
మాల్యా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

బెంగళూరు: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరిన్ని కష్టాలు ప్రారంభమైనట్టే కనిపిస్తోంది.  బెంగళూరు రుణ రికవరీ ట్రిబ్యునల్ బెంచ్ తాజా తీర్పుతో  మాల్యాకు మరిన్ని  ఇబ్బందులు తప్పేలా లేవు.  కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్  చెల్లించాల్సిన రుణాలకు సంబంధించిన రికవరీ ప్రక్రియ ప్రారంభించడానికి  స్టేట్ బ్యాంక్  ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంకు  అనుమతిని మంజూరు చూస్తూ  గురువారం డీఆర్టీ  తీర్పు  చెప్పింది. రుణాల రికవరీకి మాల్యా ఆస్తుల ఎటాచ్ మెంట్, చేపట్టాలని ఆదేశించింది.   రూ.6,203 కోట్ల రుణాలపై  జులై 26, 2013నుంచి 11.5 శాతం వడ్డీని రాబట్టవచ్చని తెలిపింది.  అంతేకాదు ఈ తీర్పుపై మాల్యా రుణ రికవరీ పునర్విచారణ న్యాయస్థానాలు (డీఆర్ ఏటీ) వెళ్లాలనుకుంటే.. మొత్తంలో 50 శాతం  కోర్టు ఫీజుగా చెల్లించాలని  స్పష్టం చేసింది.

కింగ్ఫిషర్  ఎయిర్  లైన్స్ కు వ్యతిరేకంగా తమ పిటిషన్లను విచారించిన కోర్టు ఈ మేరకు అనుమతినిచ్చిందని కన్సార్టియం న్యాయవాది  విలేకరులకు తెలిపారు.  ఆస్తులను అటాచ్ మెంట్ కు  ఆర్డర్ జారీ చేసిందని చెప్పారు.  దీంతో రుణాల రికవరీకి బ్యాంకుల గత మూడేళ్లుగా చేస్తున్న చట్టపరమైన పోరాటం ముగిసినట్టయింది.

అలాగే డీఆర్ టీ  ప్రిసైడింగ్ అధికారి కె శ్రీనివాసన్ వెలువరించిన ఈ తీర్పుతో మార్చి 2016 నుంచి యునైటెడ్ కింగ్డమ్ (యుకె) లో విలాస జీవితాన్ని గడుపుతున్న  మాల్యా చుట్టూ ఉచ్చుమరింత బిగియనుందని  భావిస్తున్నారు.కాగా మాల్యా గత సంవత్సరం మార్చి 2 న దేశం వదిలి  బ్రిటన్ కు చెక్కేశాడు.  ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్  దాఖలు చేసున కేసులో ముంబై పీఎంఎల్ఏ కోర్టు ఉద్దేశ పూర్వక ఎగవేతదారుడుగా తేల్చిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు