తేజస్ జెట్లను వినియోగించలేం: నేవీ

12 Dec, 2016 15:04 IST|Sakshi
తేజస్ జెట్లను వినియోగించలేం: నేవీ
న్యూఢిల్లీ: దేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న తేజస్ కు సేవలను అందుకోగల సామర్ధ్యం భారత విమానవాహక నౌకలకు లేదని భారతీయ నేవీ పేర్కొంది. ఈ మేరకు చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్, అడ్మిరల్ సునీల్ లాన్బా ఓ ప్రకటన విడుదల చేశారు. తేజస్ అధిక బరువు ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అధిక బరువు కలిగిన జెట్లను విమానవాహక నౌకలపై వినియోగించడం అసాధ్యమని చెప్పారు. లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ నేవీకి ఉపయోగపడుతుందని తాము భావించామని చెప్పారు. దురదృష్టవశాత్తూ తేజస్ జెట్ల అధిక బరువు విమానవాహక నౌక సామర్ధ్యానికి కంటే ఎక్కువ ఉందని చెప్పారు.
 
ప్రస్తుతం మిగ్-29కే జెట్లను విమానవాహక నౌక విక్రమాదిత్యపై వినియోగిస్తున్నామని, తర్వలో దేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఏసీ విక్రాంత్ మీద కూడా మిగ్-29కేలను ఉపయోగించనున్నట్లు తెలిపారు. నేవీ వద్ద ఉన్న విమానవాహక నౌకల సామర్ధ్యానికి తగిన విధంగా ఉండే సరికొత్త జెట్ల కోసం అన్వేషణ సాగిస్తున్నట్లు చెప్పారు. తేజస్ జెట్లకు సరిపడే విమానవాహక నౌక అవసరం నేవీకి ఉందని లాన్బా అన్నారు. నేవల్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ లను అభివృద్ధి చేసేందుకు డీఆర్డీవోను నేవీ ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కాగా, తేజస్ ను భారతీయ వాయుదళంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
 
విదేశాల నుంచి కొనుగోలు చేసిన విమానవాహక నౌకల సామర్ధ్యానికి.. మనం సొంతగా తయారుచేసే జెట్లు సరితూగకపోతే కాలానుగుణంగా టెక్నాలజీలో వచ్చిన మార్పులు అందుకు కారణంగా భావించవచ్చు. దేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఏసీ విక్రాంత్(విమానవాహక నౌక)పై కూడా తేజస్ ను వినియోగించలేమని నేవీ చెప్పడం దూరదృష్టి లేకుండానే దేశీయ జెట్లు, విమానవాహక నౌకలను తయారు చేస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. మిగ్ విమానాలకు ప్రత్యామ్నాయంగా ఓ ఫైటర్ డెవలప్ మెంట్ ను చేయాలని 1980ల్లో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1999లో విక్రాంత్ ను అభివృద్ధి చేయడానికి నిర్ణయించింది. 



మరిన్ని వార్తలు