మసూద్‌పై చైనాతో భారత్‌ మంతనాలు

3 Jan, 2017 14:36 IST|Sakshi
మసూద్‌పై చైనాతో భారత్‌ మంతనాలు

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి, జైష్‌ ఎ మొహమ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయమై చైనాతో మంతనాలు జరుపుతున్నామని, పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతోన్న మాఫియాడాన్‌ దావూద్‌ ఇబ్రహీంను భారత్‌కు రప్పించేలా చర్యలు ముమ్మరం చేశామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు.

‘మతం, జాతి, కులం, వర్గం, భాషల పేర్లతో ఓట్లు అడగడం ఎన్నికల చట్టం కింద అవినీతి చర్య కిందికే వస్తుంది’ అన్న సుప్రీం కోర్టు తీర్పును (‘కులమతాల’పై సుప్రీం కోర్టు కీలక తీర్పు) తాము ఆహ్వానిస్తున్నామని, ఆ తరహా రాజకీయాలకు బీజేపీ మొదటి నుంచి వ్యతిరేకమని రాజ్‌నాథ్ చెప్పారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో నాగావర్గీయుల ఆందోళనల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఎప్పిటికప్పుడు మాట్లాడుతున్నామని, అక్కడ గవర్నర్‌ పాలన విధించే ఆలోచన ఏదీ లేదని,  నిరసనకారులపై నిర్బంధాన్ని ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచించామని తెలిపారు.

(వెంటాడి.. దుస్తులను చించి వేధించారు)బెంగళూరులో న్యూఇయర్‌ వేడుక సందర్భంగా మహిళలపై కీచకుల వేధింపులు గర్హనీయమని, స్త్రీల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వానికి ఉండాలని రాజ్‌నాథ్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీలో తలెత్తిన విబేధాలపైనా స్పందిస్తూ తండ్రీకొడుకుల మధ్య తగవులాట మంచిదికాదని  హితవు పలికారు. ('ఏ అమ్మాయిని వారు విడిచిపెట్టలేదు')

మరిన్ని వార్తలు