ఫేస్ బుక్ పై కేసుకు పెరుగుతున్న మద్దతు!

5 Aug, 2014 13:54 IST|Sakshi
ఫేస్ బుక్ పై కేసుకు పెరుగుతున్న మద్దతు!

లండన్:సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ కు వ్యతిరేకంగా దాఖలైన దావా కేసులో యూజర్ల మద్దతు క్రమేపీ పెరుగుతోంది. ఆస్ట్రియాకు చెందిన మాక్సిమలియిన్ ష్రెమ్స్ అనే న్యాయ విద్యార్థి ఫేస్ బుక్ పై వేసిన కేసుకు సంబంధించి 11,500 మంది యూజర్లు అండగా నిలిచారు. లక్షలాది యూజర్ల వ్యక్తిగత విషయాలను ఎన్ఎస్ఏ నిఘా సంస్థకు వాళ్ల 'ప్రిజమ్' అనే నిఘా కార్యక్రమం కోసం ఫేస్బుక్ ఇచ్చేసిందని ష్రెమ్స్ కేసు వేశాడు. యూజర్ల వ్యక్తిగత రహస్యాలను ఉల్లంఘించిందంటూ ఫేస్బుక్పై కేసు వేయడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్లంత తనతో ఈ పోరాటంలో కలిసిరావాలని కోరాడు.

 

లైక్ బటన్ ద్వారా థర్డ్ పార్టీ వెబ్సైట్లకు చెందిన యూజర్లను కూడా ట్రాక్ చేస్తోందని, యూజర్లు ఆన్లైన్లో ఏం చేస్తున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోవడం ద్వారా డేటా ప్రైవసీ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆ దావాలో పేర్కొన్నాడు. దీనిపై రూ.4.6 కోట్లను ఫేస్ బుక్ చెల్లించాలని దావా వేశాడు. ఫేస్బుక్లో ఉల్లంఘనకు పాల్పడిన ప్రతీ యూజర్ నుంచి  41 వేల రూపాయిలు చొప్పున తనకు ఇప్పించాలని కోర్టుకు విన్నవించాడు. ఆగస్టు ఒకటో తేదీ వరకు ష్రిమ్స్తో పాటు అతడి పోరాటంలో 2,500 మంది చేరగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలో పదివేల మందికి పైగా యూజర్ల మద్దతు తెలుపుతున్నందుకు ష్రెమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.ఇది తాను భావించిన దానికంటే చాలా ఎక్కువ అని స్పష్టం చేశాడు.

మరిన్ని వార్తలు