అమెరికాలో ఐటీ ఉద్యోగులకు షాక్!

1 Mar, 2017 19:23 IST|Sakshi
అమెరికాలో ఐటీ ఉద్యోగులకు షాక్!
అమెరికాలో ఐటీ ఉద్యోగులకు అనుకోని షాక్ తగిలింది. ఇంతకాలం తమ వద్ద పనిచేస్తున్న 49 మంది ఐటీ ఉద్యోగులను శాన్‌ఫ్రాన్సిస్కో నగరంలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇంటికి పంపేసింది. వాళ్లు చేసే పనిని భారతదేశంలోని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థకు ఔట్‌సోర్సింగ్ ఇచ్చింది. దీనివల్ల ఆ యూనివర్సిటీకి ఐదేళ్ల కాలంలో కలిపి మొత్తం రూ. 200 కోట్ల వరకు ఆదా అవుతుంది. వాస్తవానికి గత సంవత్సరం జూలై నెల నుంచి యూనివర్సిటీ ఈ దిశగా ఆలోచిస్తోంది. ఇన్నాళ్ల తర్వాత దాన్ని అమలుచేసింది. ఆరోగ్య రంగంతో పాటు రీసెర్చ్ ఆధారిత యూసీఎస్ఎఫ్ కార్యక్రమాన్ని నిర్వహించే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా.. ఆదాయాన్ని పెంచుకోలేక, ఖర్చులు తగ్గించుకోలేక ఇబ్బంది పడుతోంది. దాంతో ఇప్పుడు తమ ఐటీ పనిని ఔట్‌సోర్స్ చేయాలని నిర్ణయించుకుంది. వాస్తవానికి ఔట్‌సోర్సింగ్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడుతున్న తరుణంలోనే ఇలాంటి నిర్ణయం రావడం గమనార్హం. 
 
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా తమ పనిని ఔట్‌సోర్సింగ్‌కు ఇవ్వడం ఇదే మొదటిసారని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. టెక్నాలజీ ఖర్చులు పెరుగుతున్నందువల్ల ఉద్యోగాలు తీసేయక తప్పలేదని, ఈ 49 మందిని తీసేయడమే కాక, ఇప్పటికే ఖాళీగా ఉన్న 48 పోస్టులను కాంట్రాక్టు ఉద్యోగులతో భర్తీ చేయడం లేదా అసలు ఆ ఉద్యోగాల ఖాళీలనే తీసేయడం లాంటి చర్యలు చేపడతామన్నారు. అయితే.. ఇలా తమ ఉద్యోగాలు తీసేసి వాటిని ఔట్‌సోర్సింగ్ చేయడం మంచి పరిణామం కాదని ఉద్యోగం పోయిన ఒక ఐటీ ఇంజనీర్ వ్యాఖ్యానించారు.
మరిన్ని వార్తలు