IT Jobs: కంపెనీ మారుతున్నారా? హైక్‌ ఎంతంటే..

9 Nov, 2023 11:16 IST|Sakshi

చదువు అయిపోయిన వెంటనే జీవితంలో తొందరగా స్థిరపడాలంటే ఐటీ ఉద్యోగమే భేష్‌ అనే ధోరణి చాలామందిలో ఉంది. కొవిడ్‌ వల్ల ఐటీ నిపుణులకు ఒక్కసారిగా పెరిగిన గిరాకీ, వారికి లభిస్తున్న అధిక వేతనాలు ఎంతోమందికి కలల ప్రపంచాన్ని చూపించాయి. తర్వాత కొత్త ప్రాజెక్టులు తగ్గడం, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ పరిణామాల వల్ల ద్రవ్యోల్బణం బాగా పెరిగి, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు ‘ఐటీ రంగం’పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

తాజాగా ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్త భయాలు మరింత ఎక్కువయ్యాయి. ఫలితంగా ఉద్యోగాల మార్కెట్లో నియామకాల వార్తల కన్నా తొలగింపులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, మెటా, అమెజాన్‌ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు మొదలు అంకురాల వరకూ వ్యయ నియంత్రణ పేరిట అధిక వేతనాలు తీసుకుంటున్న నిపుణులను తగ్గించుకుంటున్నాయి. దీంతో ఐటీ నిపుణులు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారు. అందులో భాగంగా ఇతర కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. కానీ ఐటీ రంగం అంతటా కాస్ట్‌కటింగ్‌ సమస్యే ఉంది. దాంతో కొత్తగా చేర్చుకునే వారికి మునుపటిలా భారీగా జీతాలు పెంచి ఉద్యోగాల్లో నియమించుకునే పరిస్థితి లేదు. కంపెనీ మారాలనుకునే వారి పాత జీతంపై కేవలం 18-22శాతం పెంచి ఉద్యోగాలు కల్పిస్తున్నారు.

ఐటీ ఉద్యోగాలు మారాలనుకునే వారికి జీతాల పెంపు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు సగానికి పడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి. మునుపటి కంపెనీలోని జీతంతో పోలిస్తే కేవలం 18-22% పెంపుతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. అయితే గతంలో అభ్యర్థులు కనిష్ఠంగా 40%, గరిష్ఠంగా 100-120% వరకు వేతనం పెంచాలనే డిమాండ్‌ చేసేవారని నివేదిక తెలిపింది. కానీ ప్రస్తుతం ఉద్యోగస్థాయిని ఆ డిమాండ్‌ 35-40 శాతం వరకు పడిపోయినట్లు సమాచారం. ఉదాహరణకు 2022లో ఫుల్‌స్టాక్ ఇంజినీర్లకు ఏటా రూ.15లక్షలు-రూ.32 లక్షలు వేతనం ఉండేది. ఈ సంవత్సరం సగటున 8%-16% తగ్గించి ఏటా రూ.12లక్షలు-రూ.28 లక్షలు ఆఫర్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు