దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్య కేసులో ఇంద్రాణి ముఖర్జీతో కలిసి పీటర్ ముఖర్జీ తన తనయుడు రాహుల్ను తప్పుదోవ పట్టించిన టేపులు బహిర్గతమయ్యాయి. షీనా అదృశ్యమైనప్పుడు రాహుల్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందు తండ్రి, పిన్నతల్లితో సంభాషించిన రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఈ రికార్డుల ద్వారా పీటర్ ముఖర్జీ కూడా షీనా హత్య కేసులో కుట్రదారుడేనని తేలింది. రాహుల్ ఈ సంభాషణలను తన బ్లాక్ బెర్రీ స్మార్ఫోన్లో రికార్డు చేశాడు. ఈ ఆధారాలే కేసు విచారణకు కీలకంగా మారాయి.
మొదట ఈ టేపులను ఖార్ పోలీసులకు అనంతరం సీబీఐకు రాహుల్ సమర్పించాడు. రాహుల్ సమర్పించిన టేపుల సంభాషణలతో పీటర్కు ఈ హత్య, నేరపూరిత కుట్రలో భాగమున్నట్టు తేలింది. మొత్తం 20 రికార్డింగ్లో 7 టేపులు అవసరమైనవిగా, మిగతా 13 టేపులు కేసుకు సంబంధం లేనివిగా సీబీఐ అధికార ప్రతినిధి దేవ్ప్రీత్ సింగ్ ఓ ప్రైవేట్ న్యూస్ ఛానల్కు అధికారిక ప్రకటనలో వెల్లడించారు. సీబీఐ విచారణలో ఈ టేపులను ఇప్పటికే కీలక ఆధారాలుగా పరిగణించినట్టు పేర్కొన్నారు.
సంభాషణలో కొన్ని భాగాలు...
షీనా బోరా హత్య జరిగిన వెంటనే ఇంద్రాణి తన భర్త పీటర్కు ఫోన్ చేసినట్టు సీబీఐ దర్యాప్తులో కూడా వెల్లడైంది. షీనా, రాహుల్ ప్రేమను అటు ఇంద్రాణి, ఇటు పీటర్ వ్యతిరేకించారు. విడిపోయేందుకు ఇద్దరు అంగీకరించకపోవడంతో హత్య చేసినట్టు సీబీఐ గుర్తించింది. కన్న కూతురు హత్య కేసులో తల్లి ఇంద్రాణి, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యామ్రాయ్ను తొలుత అరెస్టు చేశారు.
పీటర్ అమాయకుడని తొలుత భావించినప్పటికీ, హత్యలో పీటర్కు ప్రమేయం ఉన్నట్టు తాజా రికార్డులో కూడా వెల్లడైంది. 2012 ఏప్రిల్ 24న షీనా కనిపించకుండా అయింది. మూడేళ్ల తర్వాత ముంబై పోలీసులు ఇంద్రాణి ముఖర్జీని అరెస్టు చేశారు. అనంతరం ఈ కుట్రలో భాగమైనందున పీటర్ను సైతం అదుపులోకి తీసుకున్నారు. షీనాను హత్య చేసేందుకు ఇంద్రాణి, పీటర్ ముందే కుట్ర చేశారని ఇంద్రాణి ముఖర్జీ మాజీ డ్రైవర్ శ్యామ్వార్ రాయ్ తన వాంగ్ములంలో తెలిపాడు.