పాస్‌పోర్టు వెరిఫికేషన్‌లో పట్టుబడిన శ్రీలంక మహిళ

3 Aug, 2015 23:35 IST|Sakshi

పీలేరు(కేవీపల్లె): పాస్‌పోర్టు కోసం తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించిన శ్రీలంకకు చెందిన ఓ మహిళను చిత్తూరు జిల్లా పీలేరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పీలేరు ఎస్‌ఐ రాజశేఖర్ కథనం మేరకు.. శ్రీలంకకు చెందిన షేక్ చాందని మల్కంతియ అలియాస్ రాంపతి ద్వావలజె(35) బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లింది. పీలేరు పట్టణం సైనిక్‌నగర్‌కు చెందిన ఎస్.కాలేషా కువైట్‌కు వెళ్లాడు. అక్కడ వీరిద్దరూ ప్రేమించుకున్నారు. అనంతరం వివాహం చేసుకుని మూడేళ్ల క్రితం పీలేరుకు వచ్చారు. మల్కంతియ ప్రస్తుతం గర్భం దాల్చడంతో శ్రీలంకలో తల్లిదండ్రులను చూసేందుకు అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తప్పడు అఫిడవిట్లు సమర్పించి పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు.

తనది రాయచోటి అని... ఆధార్, ఓటరు కార్డు స్థానికంగా ఉన్నట్లు తెలిపింది. అయితే పోలీసుల విచారణలో ఆమె సమర్పించినవి తప్పుడు అఫిడవిట్లు అని ఎస్‌ఐ తెలిపారు. సోమవారం ఆమె వద్ద గల పాత పాసుపోర్టులు, ఆధార్, ఓటరు కార్డు, ఇతర పత్రాలు స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆమెను వివాహం చేసుకున్న కాలేషా ప్రస్తుతం కువైట్‌లో ఉన్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు