టెన్త్‌ విద్యార్థులతో టీచర్‌ నీచమైన పని!

30 Aug, 2016 15:49 IST|Sakshi

రాయ్‌పూర్‌: విద్యార్థులకు ఇంగ్లిష్‌ పాఠాలు బోధించాల్సిన ఉపాధ్యాయుడు తానే దారితప్పాడు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యార్థులను స్టాఫ్‌రూమ్‌కు పిలింపించుకొని.. వారితో ఒళ్లు పట్టించుకున్నాడు. బొక్కబోర్ల పడుకున్న అయ్యవారికి ఓ విద్యార్థి నడుముపై భాగంలో మసామ్‌  చేస్తే.. మరో ఇద్దరు విద్యార్థులు చెరోకాలిని పట్టుకొని నొక్కారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిపోయింది.  

ఛత్తీస్‌గఢ్‌ జశ్‌పూర్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. తుమ్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అనూప్‌ మింజ్‌ ఇంగ్లిష్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కానీ ఆయన తాజాగా విద్యార్థులను స్టాప్‌రూమ్‌కు పిలింపించుకొని ఒళ్లు పట్టించుకున్నాడు. ముగ్గురు విద్యార్థులు సేవకులుగా ఆయన ఒళ్లు పడుతుండగా వీడియో కెమెరా కంటికి చిక్కింది. ఈ వీడియో ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టించింది. సోషల్‌ మీడియాలో దావానలంలా పాకింది. దీంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా విద్యాధికారికి సదరు ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకుంటామని విద్యాధికారి హామీ ఇచ్చారు. ఈ చర్యకు పాల్పడిన ఇంగ్లిష్‌ టీచర్‌ అనూప్‌ మాత్రం 'నేను జ్వరంతో ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నా. నేనేమీ విద్యార్థులను ఒళ్లు పట్టమని బలవంతపెట్టలేవు. వారే ఉద్దేశపూరితంగా అలాచేశారు' అని చెప్పుకొచ్చారు.
 

మరిన్ని వార్తలు