కరెంట్ కట్ చేసి చావబాదారు

18 Sep, 2014 14:56 IST|Sakshi
కరెంట్ కట్ చేసి చావబాదారు

విద్యార్థినులను జుట్టు పట్టుకుని ఈడ్చి పడేశారు. విద్యార్థులను కాళ్లతో తన్నుతూ చితకబాదారు. ఇది కచ్చితంగా వీధి రౌడీల పనే అయివుంటుందని అనుకుంటున్నారా. అయితే మీరు పప్పులో కాలేశారు. ఇదంతా చేసింది ప్రజలను కాపాడాల్సిన రక్షక భటులు అంటే నమ్మాల్సిందే.

పశ్చిమ బెంగాల్ లోని జాదవ్పూర్ యూనివర్సిటీలో ఖాకీలు బుధవారం బీభత్సకాండ సృష్టించారు. ఇంతకీ విద్యార్థులు చేసిన తప్పు ఏంటంటే తమ డిమాండ్ల సాధన కోసం వైస్ ఛాన్సలర్ ను శాంతియుతంగా అడ్డుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు తమ మార్క్ జులుం ప్రదర్శించారు. క్యాంపస్ గేట్లు మూసేసి పదినిమిషాల పాటు భయోత్పాతం సృష్టించారు. కరెంట్ కట్ చేసి విద్యార్థులను విచక్షణారహితంగా బాదారు.

మఫ్టీలో వచ్చిన ఖాకీలు తమపై దౌర్జన్యం చేయడమే కాకుండా, అసభ్యంగా ప్రవర్తించారని బాధిత విద్యార్థినులు ఆరోపించారు. తమ బట్టలు చించారని, ఛాతీపై కొట్టారని, బలవంతంగా మగాళ్లపైకి తోసారని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. ఖాకీల వికృత ప్రవర్తనపై ఓ విద్యార్థిని ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదు. పోలీసుల దాడిలో గాయపడిన విద్యార్థుల్లో ఇద్దరు ఐసీయూలో ఉన్నారు. పోలీసుల దమనకాండను విద్యార్థి సంఘాలు తీవ్రంగా నిరసించాయి.

మరిన్ని వార్తలు