బిందుసేద్యంపై..రైతుల దృష్టి

18 Nov, 2014 00:17 IST|Sakshi

 పరిగి రూరల్: వర్షాభావ పరిస్థితులు, క రెంటు కోతల దృష్ట్యా రైతులు బిందుసేద్యంపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వం బిందుసేద్యం, స్ప్రింక్లర్ల సాగును ప్రోత్సహిస్తూ సబ్సిడీలు కూడా ఇస్తోంది. అంతేకాకుండా కూరగాయల సాగుకు డ్రిప్ ఎంతో బాగుంటంతో రైతులు మక్కువ చూపిస్తున్నారు. మండల పరిధిలోని బసిరెడ్డిపల్లి, మాదారం, ఖుదావంద్‌పూర్, పొల్కంపల్లి తదితర గ్రామాల్లో రైతులు డ్రిప్ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నారు. బీర, కీర, కాకర, సొరకాయ తదితర కూరగాయలను పండిస్తున్నారు. వర్షాలు లేకపోవడం, కరెంటు కోతల కారణంగా ఉన్న బోరు బావిలోని నీటిని పొదుపుగా వాడుకుంటూ తక్కువ నీటితో ఎక్కువ సేద్యం చేసేందుకు శ్రీకారం చుట్టారు.

 తీగజాతి కూరగాయల సాగుతో మరింత లాభం
 డ్రిప్‌తో ఎక్కువగా కీర, కాకర, సొరకాయ తదితర తీగజాతి కూరగాయల సాగును ఎంచుకున్నారు. తక్కువ శ్రమ, ఎక్కువ లాభం ఉండటంతో రైతుల ఈ సాగుపై దృష్టి సారించారు. మార్కెట్‌లో కీర, కాకర, సొరకాయలకు కూడా మంచి డిమాండ్ ఉండటంతో మూడేళ్లుగా రైతులు ఈ పంటలను సాగు చేస్తూ మంచి లాభాన్ని ఆశిస్తున్నారు. ఎకరా కీర సాగులో ఖర్చులన్నీ పోనూ ఈసారి రూ.70 వేలకు వరకు లాభం వచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు.

మరిన్ని వార్తలు