అయ్యప్ప దీక్షాపరుడి ఆత్మహత్య

24 Dec, 2023 09:42 IST|Sakshi

నిర్మల్‌టౌన్‌: అయ్యప్ప దీక్షాపరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం... జిల్లా కేంద్రంలోని దివ్యనగర్‌ కాలనీకి చెందిన అంబల సురేష్‌(47) స్థానిక మంచిర్యాల చౌరస్తాలో ఎస్‌ బేకరీ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాల్కొండ నియోజకవర్గంలోని కిసాన్‌నగర్‌ నుంచి నిర్మల్‌కు వలసవచ్చాడు. 22ఏళ్ల నుంచి అయ్యప్ప మాల స్వీకరిస్తున్నాడు. శని వారం తెల్లవారుజా మున ఆరు గంటల ప్రాంతంలో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో భార్య తలుపులు కొట్టినా తీయకపోవడంతో కిటికిలోంచి చూసి చుట్టుపక్కల వారిని పిలిచింది.

వెంటనే అక్కడికి చేరుకున్న స్థానికులు తలుపులు తీసి చూడగా ఉరేసుకుని కనిపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి ఫోన్‌ను పరిశీలించగా ఆరోగ్య సమస్యలు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వాయిస్‌ మెసేజ్‌ పెట్టాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ ఎస్సై శంకర్‌ తెలిపారు. సురేశ్‌కు భార్య, కూతురు ఇంటర్‌ చదువుతుండగా, కొడుకు బీటెక్‌ చదువుతున్నాడు.

>
మరిన్ని వార్తలు