గోస్తనీ నదిలో విద్యార్థి గల్లంతు.. ఆవేదనలో తల్లిదండ్రులు!

11 Dec, 2023 11:34 IST|Sakshi
హరి (ఫైల్‌)

పద్మనాభం: మండలంలోని పాండ్రంగి పంచాయతీ కురపల్లి చెక్‌ డ్యామ్‌ వద్ద ఆదివారం స్నానానికి దిగిన ఇంటర్‌ విద్యార్థి గల్లంతైనట్టు ఎస్‌ఐ జె.సురేష్‌ తెలిపారు. ఎస్‌ఐ అందించిన వివరాలిలా ఉన్నాయి. పీఎం పాలెం గాయత్రినగర్‌కు చెందిన ఎనిమిది మంది మహిళలు, ఐదుగురు పురుషులు కలిసి ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆటోలో కురపల్లి పిక్నిక్‌కు వచ్చారు.

వీరిలో పొన్నగంటి హరి (16)తోపాటు ముగ్గురు చెక్‌ డ్యామ్‌ వద్ద గోస్తనీ నదిలోకి స్నానానికి దిగారు. ఈ క్రమంలో హరి నదిలో గల్లంతయ్యాడు. మిగతా ఇద్దరు ఒడ్డుకు చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. విషయం తెలుసుకున్న పాండ్రంగి గ్రామానికి చెందిన జాలర్లు, కురపల్లి గ్రామస్తులు నదిలో హరి కోసం సాయంత్రం ఐదు గంటల వరకు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు.

దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్‌ఐ సురేష్‌ తెలిపారు. గాయత్రినగర్‌కు చెందిన పొన్నగంటి అప్పారావు, రమణమ్మ దంపతులకు హరి, ఉదయ్‌ ఇద్దరు కుమారులు సంతానం. వీరిలో రెండోవాడైన హరి మద్దిలపాలెం కృష్ణా కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. ఉదయ్‌ పాలిటెక్నికల్‌ చదువుతున్నాడు. తండ్రి అప్పారావు స్థానిక బీసీ హాస్టల్‌లో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. హరి, ఉదయ్‌ చక్కగా చదువుకుని ప్రయోజకులై తమకు అండగా నిలుస్తారని ఆశపడితే, ఇలా గల్లంతయ్యాడని తల్లి రమణమ్మ, గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు.

ఇది చదవండి: పాదయాత్రగా వెళ్లి.. దుర్మరణం పాలై!

>
మరిన్ని వార్తలు