● డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు
డీసీసీబీ చైర్మన్ గురువులను సత్కరిస్తున్న పర్సన్ ఇన్చార్జులు రాజేష్, చెల్లంనాయుడు
మాడుగుల: వచ్చే మార్చిలోగా రైతులకు రూ.100 కోట్లు రుణాలు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని డీసీసీబీ చైర్మన్ కోలా గురువులు అన్నారు. స్థానిక జిల్లా కేంద్ర సహకార బ్యాంకును ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన్ను పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జులు గొల్లవిల్లి రాజేష్, కోరుకొండ చెల్లంనాయుడు, బొద్దపు భాస్కరరావు, కాళ్ల రాము కలిశారు. మాడుగుల మండలంలో శిథిలమైన నాలుగు పీఏసీఎస్ భవనాలను అభివృద్ధి చేయాలని, సభ్య రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం చైర్మన్ గురువులుకు దుశ్శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.
తల్లి పార్ధీవ దేహాన్ని తీసుకువెళ్లిన్న కుమార్తె
మునగపాక: కొడుకులు లేకున్నా తానున్నానంటూ ముందుకొచ్చి తల్లికి కుమార్తె తల కొరివి పెట్టి రుణం తీర్చుకుంది. ఈ సంఘటన మునగపాకలో శనివారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పీలా జగ్గయమ్మ (72) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది. ఆమెకు కుమారులు లేరు. దాంతో కుమార్తె దాడి మహా వెంకటలక్ష్మి అన్నీ తానై తల్లి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ సంఘటన స్థానికులను కంటతడి పెట్టించింది.
యథావిధిగా రిజిస్ట్రేషన్లు
అనకాపల్లి టౌన్: స్థానిక జాతీయ రహదారి ఏఎంఎఎల్ కళాశాల జంక్షన్ వద్ద సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో శనివారం 32 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసినట్టు సబ్ రిజిషర్ వి.బసవేశ్వరరావు చెప్పారు. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ సర్వర్ పనిచేయకపోవడంతో రిజిస్ట్రేషన్లు జరగలేదని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారుగా 300 రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిపారు.