స్కిల్ కుంభకోణం కేసులో కీలక పరిణామం

5 Dec, 2023 16:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌’ కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏ13 నిందితుడు చంద్రకాంత్ షాని ఏసీబీ కోర్టు ముందు సీఐడీ అధికారులు హాజరుపర్చారు. అప్రూవర్‌గా మారుతున్నట్లు కోర్టు ఎదుట చంద్రకాంత్ షా తెలిపారు. తదుపరి విచారణను ఏసీబీ కోర్టు జనవరి‌5కి వాయిదా వేసింది. చంద్రకాంత్ షా స్టేట్‌మెంట్‌ని జనవరి 5న ఏసీబీ కోర్టు రికార్డు చేయనుంది.

షెల్‌ కంపెనీలు, బోగస్‌ ఇన్వాయిస్‌ల ద్వారా చంద్రబాబు ముఠా అడ్డగోలుగా నిధులను అక్రమంగా తరలించారన్నది స్పష్టమైన సంగతి తెలిసిందే. ఈ బాగోతంలో కీలక పాత్రధారిగా ఉన్న ఏసీఐ కంపెనీ ఎండీ చంద్రకాంత్‌ షా అప్రూవర్‌గా మారారు.

స్కిల్‌ స్కాం కేసులో నిందితుడు (ఏ–13)గా ఉన్న ఆయన తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించాలని న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ స్కాంలో బోగస్‌ ఇన్వాయిస్‌ల ద్వారా నిధులను ఎలా కొల్లగొట్టిందీ వివరిస్తూ ఆయన గతంలోనే గుంటూరులోని న్యాయస్థానంలో 2022, జులై 23న 164 సీఆర్‌పీసీ కింద వాంగ్మూలం ఇచ్చారు.

ఈ కేసులో తాను అప్రూవర్‌గా మారి స్కిల్‌ స్కాంలో సూత్రధారులు, పాత్రధారులు, తెరవెనుక కుట్రను వెల్లడించేందుకు ఆయన స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అందుకోసం తాను అప్రూవర్‌గా మారేందుకు అనుమతించి తనను ఈ కేసులో సాక్షిగా పరిగణించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో గత నెలలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ కేసులో చంద్రకాంత్‌ షాను సీఐడీ గతంలో అరెస్టుచేయగా ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు.
చదవండి: స్కిల్‌ స్కాంలో చంద్రబాబు పాత్రకు ఆధారాలున్నాయి 

>
మరిన్ని వార్తలు