రుయా మరణాలపై పిల్‌ను పరిష్కరించిన హైకోర్టు

19 Aug, 2021 04:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: కరోనాకు చికిత్స పొందుతూ తిరుపతి రుయా ఆసుపత్రిలో పలువురు రోగులు మృతి చెందిన ఘటనపై ప్రత్యేక విచారణ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం చెబుతున్న లెక్కల కన్నా ఎక్కువ మంది మృతులుంటే ఆ వివరాలను జిల్లా కలెక్టర్, ఎస్‌పీలకు అందచేయవచ్చునని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. పోలీసుల దర్యాప్తులో న్యాయం జరగలేదని భావిస్తే పిటిషనర్‌ తిరిగి కోర్టుకు రావొచ్చునంది.

ప్రభుత్వ పరిహారంపై అభ్యంతరాలుంటే బాధితుల కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించవచ్చునంటూ పిటిషన్‌ను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్, జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రుయా ఆసుపత్రి ఘటనలో బాధ్యులైన అధికారులు, ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత మోహనరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు