ఆ విషయంలో ఏమాత్రం రాజీపడం : సీఎం జగన్‌

23 Nov, 2020 12:29 IST|Sakshi

మహిళల భద్రత కోసం 'అభయం' ప్రాజెక్ట్

దేశంలోనే తొలిసారిగా దిశా బిల్లును ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచాం: సీఎం

సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ్‌ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. రవాణాశాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామన్నారు. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవులు,పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించిట్లు స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తున్నామన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటంలేదని అన్నారు. (అవినీతిపై తిరుగులేని అస్త్రం)

అక్కాచెల్లెమ్మలకు అండగా
తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యం కల్పించాలని ఆదేశాలు ఇచ్చాం. దేశంలోనే తొలిసారిగా దిశా బిల్లును ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచాం. ప్రతి జిల్లాలో దిశా పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేశాం. దిశా ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. దిశా యాప్‌ ద్వారా అక్కాచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం. ప్రతి గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా పోలీస్‌ను కూడా నియమించాం. రవాణా శాఖ ఆధ్వర్యంలో అభయం యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఆటోలు, క్యాబ్‌ల్లో నిర్భయంగా ప్రయాణించేందుకు యాప్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఆటో, క్యాబ్‌లో అభయం యాప్‌ డివైజ్ ఏర్పాటు చేస్తాం. తొలిసారిగా వెయ్యి వాహనాల్లో డివైజ్ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాలకు డివైజ్ ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు. 

మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి రూ.80.09 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. దశలవారీగా రాష్ట్రంలో లక్షరవాణా వాహనాలకు ట్రాకింగ్‌ డివైస్‌లు బిగించి వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని రవాణాశాఖ లక్ష్యం పెట్టుకుంది. తొలిదశలో విశాఖపట్టణంలో వెయ్యి ఆటోల్లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలో అమలు చేస్తారు.  

‘అభయం’ అమలు ఇలా..
రవాణా వాహనాల్లో ట్రాకింగ్‌ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు.

► రవాణా వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులు అమర్చాలి.

► తొలుత వెయ్యి ఆటోల్లో సోమవారం ఈ పరికరాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఫిబ్రవరి 1 నాటికి ఐదువేల వాహనాలు, జూలై 1కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబరు 31కి లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తారు. ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు ఉంటుంది.

► ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే వారు తమ మొబైల్‌లో ‘అభయం’ మొబైల్‌ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. వాహనంఎక్కేముందు వాహనానికి అంటించిన క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి.

► స్కాన్‌ చేయగానే డ్రైవరు ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి.

► స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్‌ యాప్‌ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్‌ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది.

► స్మార్ట్‌ ఫోన్‌ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్‌ బటన్‌ నొక్కితే సమాచారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటరుకు చేరుతుంది. క్యాబ్‌/ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ వెంటనే సమీపంలోని పోలీస్‌ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు. 

► ఐవోటీ ఆధారిత బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్‌ఎఫ్‌ఐడీ) కార్డులు ఇస్తారు.

► ఆటోలు స్టార్ట్‌ చేసేటప్పుడు ఈ ఆర్‌ఎఫ్‌ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐవోటీ బాక్సుకు స్వైప్‌ చేస్తేనే స్టార్ట్‌ అవుతుంది.  

మరిన్ని వార్తలు