చిరు పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం భారీ సహాయం..

28 Jul, 2021 22:28 IST|Sakshi

పూతరేకులు, పాలకోవా, హల్వా వంటి స్నాక్స్‌ తయారీకి ప్రభుత్వ చేయూత

ఆధునికీకరించుకునేందుకు అవకాశం

రూ.10 లక్షల వరకూ సబ్సిడీ

ఇప్పటికే ఉన్న పరిశ్రమలకు వర్తింపు

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల కోసం పాడేరు, అరకు, అనకాపల్లిలో ప్రత్యేక పార్కులు

ఇప్పటికే స్థలాలను గుర్తించిన ప్రభుత్వం

సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో చిరు పరిశ్రమలకు భారీ సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారు తమ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు... తమ ఉత్పత్తులకు ఒక బ్రాండింగ్‌ కలి్పంచేందుకు ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబదీ్ధకరణ పథకం (పీఎం–ఎఫ్‌ఎంఈ) కింద సహాయం అందించనుంది. ఈ పథకం కింద పూతరేకులు, స్నాక్స్‌ తయారీ, హల్వా, పాలకోవ వంటివి తయారుచేసే యూనిట్ల యాజమాన్యాలు తమ వ్యాపారాన్ని మరింత ఆధునికీకరించుకునేందుకు ఇది దోహదపడనుంది. ఇప్పటికే ఈ యూనిట్లను నిర్వహిస్తున్న వారు  ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటే ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం లేదా 10 లక్షల వరకు గరిష్టంగా సబ్సిడీ కింద ప్రభుత్వం మంజూరు చేస్తుంది.

ఇక మిగిలిన 65 శాతంలో 10 శాతం మార్జిన్‌ మనీ కింద లబి్ధదారుడు భరించాల్సి ఉంటుంది. 55 శాతం బ్యాంకు రుణం కింద పొందవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా లబి్ధదారులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  కొత్త యూనిట్లను స్థాపించే వారు కూడా ఈ పథకం కింద లబ్ధి పొందే అవకాశం ఉంది. కేవలం చెరకు పంట ఆధారిత ఉత్పత్తుల తయారీ అంటే చక్కెర, బెల్లం, చాక్లెట్స్‌ తయారీ వంటి యూనిట్లకు అవకాశం ఉంటుంది. మరోవైపు కొద్ది మంది రైతులు కలిపి గ్రూపుగా ఏర్పడి యూనిట్‌ను ఏర్పాటు చేసుకుంటే ప్రాజెక్టు వ్యయంలో ఏకంగా 75 శాతం వరకు సబ్సిడీ పొందే అవకాశం ఉంది.  

జిల్లాలో 4  పారిశ్రామిక పార్కులు
ఒకవైపు చిరు పరిశ్రమలను ప్రోత్సహించడంతోపాటు మరోవైపు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాఫీ, చిరుధాన్యాలు, చెరకు పంట, గిరిజన హారి్టకల్చర్‌ ఉత్పత్తుల కోసం ప్రత్యేకంగా 4 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం స్థలాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది. ఈ పార్కుల్లో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వమే భూమిని కేటాయించడంతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలను (విద్యుత్, నీరు, రోడ్లు వగైరా) కలి్పంచనుంది. ఇక్కడ యూనిట్లను నెలకొల్పేందుకు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తు (ఈవోఐ)లను ప్రభుత్వం ఆహ్వానించింది. ఆయా పారిశ్రామిక పార్కుల్లో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

చిరువ్యాపారులకు మంచి అవకాశం 
చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని మరింత ఆధునికీకరించుకునేందుకు పీఎం–ఎఫ్‌ఎంఈ కింద మంచి అవకాశం ఉంది. మొత్తం వ్యయంలో 35 శాతం లేదా గరిష్టంగా 10 లక్షల వరకూ సబ్సిడీ లభిస్తుంది. ఇందుకోసం ఆన్‌లైన్‌లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌ఏపీఎఫ్‌పీఎస్‌ డాట్‌కామ్‌/పీఎం–ఎఫ్‌ఎంఈ అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను జిల్లా స్థాయిలో నేను పరిశీలించిన తర్వాత రాష్ట్ర స్థాయిలో మంజూరవుతుంది.   
– కె.గోపికుమార్, ప్రాజెక్టు డైరెక్టర్, ఏపీఎంఐపీ 

మరిన్ని వార్తలు