టీడీపీ హయాంలో ‘డేటా చోరీ’పై ఏపీ హౌజ్‌ కమిటీ మధ్యంతర నివేదిక

20 Sep, 2022 12:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో డేటా చోరీ జరిగింది వాస్తవమేనని.. తిరుపతి ఎమ్మెల్యే, పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై ఏర్పాటైన సభా సంఘం చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ధృవీకరించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా.. ఇవాళ (మంగళవారం) డేటా చోరీ వ్యవహారంపై విచారణ చేపట్టిన హౌజ్‌ కమిటీ రూపొందించిన మధ్యంతర నివేదికను ఆయన చదివి వినిపించారు. 

ప్రాథమిక విచారణలో గత టీడీపీ ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు సభా సంఘం నిర్ధారణకు వచ్చిందని భూమన తెలియజేశారు. 2017-19.. మరీ ముఖ్యంగా 2018-19 మధ్యకాలంలో ప్రైవేట్‌ సమాచారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి.. తెలుగుదేశానికి చెందిన సేవా మిత్ర యాప్‌ ద్వారా సుమారు 30 లక్షల ఓట్లు రద్దు చేసే ప్రక్రియకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, దీనిని తమ విచారణలో సభాసంఘం గుర్తించినట్లు భూమన తెలిపారు. 

ఓట్లు వేయనివాళ్ల సమాచారాన్ని స్టేట్‌ డేటా సెంటర్‌ నుంచి సేవా మిత్ర అనే యాప్‌ ద్వారా పూర్తిగా చోరీ చేసే యత్నం చేశారని, ఆ చౌర్యం చేసిన చోరులను పట్టుకోవాల్సిన బాధ్యతను తాము లోతుకు వెళ్లి విచారిస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రాథమిక విచారణ నివేదికను స్పీకర్‌కు చదివి వినిపించారు భూమన. నివేదిక చదివి వినిపిస్తు‍న్న సమయంలో.. టీడీపీ సభ్యులు గోల చేశారు.

మరిన్ని వార్తలు