డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌ మార్పు 

8 Aug, 2022 04:38 IST|Sakshi

మచిలీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరం ప్రవేశాలకు షెడ్యూల్‌ మార్పు చేసినట్లు కన్వీనర్‌ ఆచార్య దారపురెడ్డి సూర్యచంద్రరావు ఆదివారం తెలిపారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం విద్యార్థులు ఉన్నత విద్యామండలి వెబ్‌సైట్‌లో ఈనెల 15 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఏదైనా సర్టిఫికెట్‌ పొందుపరచడం మరిచిపోతే, ఈ నెల 16 నుంచి 18 వరకు పెండింగ్‌ సర్టిఫికెట్లను అప్‌లోడ్‌ చేసి, మరోమారు ధ్రువీకరించుకునేందుకు వెసులుబాటు కల్పించారు.

గుర్తింపు (అఫిలియేషన్‌) ఇచ్చిన కాలేజీల జాబితాను యూనివర్సిటీ అధికారులు ఈనెల 20, 21 తేదీల్లో వెబ్‌సైట్‌లో ఉంచాలి. ఈ నెల 22 నుంచి 26 వరకు విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీలో డిగ్రీ ప్రవేశం కోసం వెబ్‌సైట్‌ ద్వారా ఎంపిక చేసుకోవాలి. 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్‌ ఒకటి, రెండో తేదీల్లో విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలి. సెప్టెంబర్‌ రెండో తేదీ నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేలా ఉన్నత విద్యామండలి తాజాగా షెడ్యూల్‌ విడుదల చేసింది.  

మరిన్ని వార్తలు