రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు 

31 Aug, 2021 03:56 IST|Sakshi

బలపడిన రుతుపవనాలు.. వచ్చేనెలంతా వానలు!

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం 12 జిల్లాల్లో వర్షాలు కురిశాయి. సగటున రాష్ట్ర వ్యాప్తంగా 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అనేక చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు పడ్డాయి. విజయనగరం జిల్లాలో 5 మి.మీ. సగటు వర్షపాతం నమోదవగా, శ్రీకాకుళం జిల్లాలో 4.2, పశ్చిమగోదావరిలో 4.2, తూర్పుగోదావరిలో 3.2, విశాఖపట్నంలో 3, గుంటూరులో 1.9, కృష్ణాలో 1.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది.

వైఎస్సార్‌ కడప జిల్లాలో మాత్రమే వర్షపాతం నమోదవలేదు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో అత్యధికంగా 73.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అదే జిల్లా నర్సాపురంలో 66, తూర్పుగోదావరి జిల్లా మలికిపురంలో 65.5, విజయనగరం జిల్లా సాలూరులో 45, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగలలో 39.8, కోరుకొండలో 36.3, సఖినేటిపల్లిలో 36, విశాఖ జిల్లా మేకావారిపాలెంలో 33.5, పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్రలో 33, తూర్పుగోదావరి జిల్లా చింతూరులో 32.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. వచ్చే రెండురోజులు ఇలాగే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు బలపడ్డాయని పేర్కొంది. 

ఛత్తీస్‌గఢ్‌ సమీపంలో అల్పపీడనం 
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 4.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతుండగా, అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన రుతుపవన ద్రోణి శివపురి, ఛత్తీస్‌గఢ్, విశాఖపట్నం మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.   

మరిన్ని వార్తలు