AP: దివ్యాంగులకు రిజర్వేషన్‌ పెంపు

14 Oct, 2022 03:19 IST|Sakshi

ఉద్యోగాలు, పదోన్నతుల్లో 3 నుంచి 4 శాతానికి.. 

నిర్ధారిత వైకల్యాలున్న వారికి వర్తింపు

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌శర్మ

సాక్షి, అమరావతి: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్‌ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడుశాతం ఉన్న రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నిర్ధారిత వైకల్యాలున్న వారికి నాలుగు శాతం రిజర్వేషన్‌ వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఏశాఖలోనైనా రిజర్వేషన్ల నుంచి మినహాయింపు అవసరమైతే అందుకు తగిన కారణాల సమర్థనతోపాటు ఇంటర్‌ డిపార్ట్‌మెంటల్‌ కమిటీ అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ రిజర్వేషన్‌ పెంపునకు అనుగుణంగా ఏపీ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌–1996లో సవరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

వికలాంగుల హక్కుల చట్టం–2016లోని సెక్షన్‌–34 ప్రకారం ప్రభుత్వ నియామకాలు, పదోన్నతుల్లో నిర్ధారిత వైకల్యాల వ్యక్తులకు నాలుగుశాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ 2020 ఫిబ్రవరి 19వ తేదీన మహిళా శిశు సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్‌ కల్పించింది.   

మరిన్ని వార్తలు