కూకట్‌పల్లి ఆర్యసమాజ్‌లో ప్రేమపెళ్లి.. జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉంది

9 Jan, 2022 14:41 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నుంచి ప్రాణహాని ఉందని ఓ ప్రేమజంట ఆరోపిస్తోంది. తమను విడదీసేందుకు కుటుంబ సభ్యులు కూడా ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. వివరాల్లోకెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన అపర్ణ, విశాఖకు చెందిన రవికిరణ్‌ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని ఐదేళ్లుగా ప్రయత్నిస్తున్నారు.

ఈ విషయాన్ని అపర్ణ తల్లిదండ్రులకు తెలపగా వారు నిరాకరించారు. ఈ క్రమంలోనే వారు కూకట్‌పల్లి ఆర్యసమాజ్‌లో ప్రేమపెళ్లి చేసుకున్నారు. అపర్ణ​ కనిపించడం లేదంటూ తల్లిదండ్రులు తూర్పుగోదావరి గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపర్ణను సంప్రదించగా, తాను సురక్షితంగా ఉన్నానని తెలిపింది. అయితే విచారణలో భాగంగా గండేపల్లి రావాలని పోలీసులు కోరారు.

చదవండి: (అబ్బాయి కన్నా అమ్మాయి పెద్ద.. చివరికి ఏమైందంటే?)

తల్లిదండ్రులనుంచి ఇబ్బంది కలుగుతోందని భావించిన ప్రేమజంట విశాఖలోని మహిళా చేతన ప్రతినిధులను సంప్రదించారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న జ్యోతుల నెహ్రూ తూర్పుగోదావరి జిల్లాకు పంపాలని చేతన కన్వినర్‌పై ఒత్తిడి తెచ్చారు. దీనిపై మహిళా చేతన కన్వినర్‌ కత్తి పద్మ మాట్లాడుతూ.. 'ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతిని జగ్గంపేట రావాలని జ్యోతుల నెహ్రూ ఒత్తిడి చేయడం సరికాదు. నిజంగా ఆయనకు చట్టంఐ గౌరవం ఉంటే విశాఖపట్నం రావచ్చు. ఈ విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు పాల్పడితే అంగీకరించే పరిస్థితి లేదు' అని కన్వినర్‌ కత్తి పద్మ అన్నారు. 

ఈ విషయంపై అపర్ణను సం‍ప్రదించగా.. 'వివాహం విషయంలో మా బంధువులు బ్లాక్‌ మెయిల్‌ చేశారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మా కుటుంబానికి బంధువులు. ఆయన మాపై ఒత్తిడి తెస్తున్నారు. జగ్గంపేట గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తే మాకు ప్రమాదం ఉంది' అని అపర్ణ తెలిపింది. 

మరిన్ని వార్తలు