ఏపీలో మెగా ఐటీ జాబ్‌ఫెయిర్‌

23 Dec, 2021 03:54 IST|Sakshi

ఏపీఎస్‌ఎస్‌డీసీ, అపిటా, ఐటాప్‌ నిర్వహణ

30 కంపెనీల్లో ఉద్యోగాలు

ఆసక్తిగల విద్యార్థులు 25 లోగా దరఖాస్తు చేసుకోవాలి

స్క్రీనింగ్‌ టెస్ట్‌లో ఎంపికైన వారు జాబ్‌ఫెయిర్‌కు అర్హులు

సాక్షి, అమరావతి: ఐటీ రంగంలో హైఎండ్‌ ఉద్యోగాలు కల్పించే విధంగా మెగా జాబ్‌ ఫెయిర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఎపీఎస్‌ఎస్‌డీసీ), ఆంధ్రప్రదేశ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అకాడమీ (అపిటా), ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌(ఐటాప్‌) సంయుక్తంగా ఇండస్ట్రీ స్పెసిఫిక్‌ ట్రైనింగ్‌ ప్రోగ్రాం పేరుతో వర్చువల్‌ మెగా జాబ్‌ఫెయిర్‌ నిర్వహిస్తున్నాయి. 30కి పైగా కంపెనీల్లో ఫుల్‌స్టాక్‌ డెవలపర్, బిజినెస్‌ ప్రాసెసింగ్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేట్‌ (బీపీఎం) విభాగాల్లో ఉద్యోగాలకు సంబంధించి ఈ జాబ్‌ఫెయిర్‌ ఏర్పాటు చేశాయి.

ఆసక్తిగల విద్యార్థులు డిసెంబర్‌ 25లోగా preciouscareers.com/istp అనే వెబ్‌ లింక్‌ ద్వారా నమోదు చేసుకోవాలని ఏపీఎస్‌ఎస్‌డీసీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించింది. ఆ ప్రకటన మేరకు.. 2018 నుంచి 2021 వరకు ఇంజనీరింగ్‌ (ఐటీ/సీఎస్‌ఈ/ఈఈఈ/ఈసీఈ), ఎంసీఏ/ఎంఎస్సీ  55 శాతం మార్కులతో పూర్తిచేసినవారు ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌ ఉద్యోగాలకు, 2017 నుంచి 2021 వరకు డిగ్రీ పూర్తిచేసినవారు బీపీఎం ఉద్యోగాలకు అర్హులు. నమోదు చేసుకున్న వారికి 27వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు.

వీరికి ఆయా కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంటాయి. స్క్రీన్‌టెస్ట్‌ తుదిజాబితాలో ఉండి ఉద్యోగం పొందలేని విద్యార్థులకు విశాఖలో జనవరి 19 నుంచి 35 రోజులు ఫుల్‌స్టాక్‌ డెవలపర్, బీపీఎం కోర్సుల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తిచేసుకున్నవారికి కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి మంచి వేతనంతో ఉద్యోగాలిస్తాయి. మరిన్ని వివరాలకు ఎపీఎస్‌ఎస్‌డీసీ టోల్‌ ఫ్రీ నంబరు 9988853335లో సంప్రదించవచ్చు. 

మరిన్ని వార్తలు