ఫైబర్‌గ్రిడ్‌.. మదర్‌ ఆఫ్‌ స్కామ్స్‌!

21 Sep, 2021 16:04 IST|Sakshi

అర్హతలేని టెరాసాఫ్ట్‌కు టెండర్‌ కట్టబెట్టడం వెనుక పెద్ద కుట్ర 

నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్‌ కన్సార్టియం రెండు ప్రైస్‌బిడ్లు వేసింది 

మాకు అన్ని అర్హతలున్నా పక్కన పెట్టారు

అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రభుత్వం ఫైబర్‌ గ్రిడ్‌ స్కామ్‌కు పాల్పడింది

సీఐడీ సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలి

పేస్‌ పవర్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ మద్దిశెట్టి

సాక్షి, అమరావతి: ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు పెద్దఎత్తున జరిగాయని, ఈ విషయంలో గత టీడీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని, దీనిని కుంభకోణం అనడం కంటే.. మదర్‌ ఆఫ్‌ స్కామ్స్‌ అన టం కరెక్టు అని పేస్‌ పవ ర్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమి టెడ్‌ ఎండీ, ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ తీవ్రంగా విమర్శించారు. టెండర్‌ వేసిన సమయంలో తాను వైఎస్సార్‌సీపీ సభ్యుడిని కూడా కాదని, ఒక ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా అన్ని అర్హతలతో ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు కోసం పేస్‌ పవర్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున టెండర్‌ వేశానన్నారు. కానీ, ఎటువంటి అర్హతలేని, బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టెరాసాఫ్ట్‌ కన్సార్టియంకు అప్పటి టీడీపీ ప్రభుత్వం దొడ్డిదారిన టెండర్‌ ఖరారు చేసిందని ఆరోపించారు. నిజానికి ఫైబర్‌గ్రిడ్‌ మొదటి దశ పనుల కోసం చేపట్టిన రూ.329 కోట్ల టెండరు ఎంపికలోనే పెద్ద స్కాం జరిగిందన్నారు. ఆ తర్వాత సెటాప్‌ బాక్సులు, సీసీ కెమెరాలు, భారత్‌ నెట్‌ ఫేజ్‌–2లకు సంబంధించి మొత్తం రూ.3,113 కోట్లకు టెండర్లు పిలిచారని.. ఈ వ్యవహారంలో గత తెలుగుదేశం ప్రభుత్వం భారీ స్కామ్‌కు పాల్పడిందని ఆయన వివరించారు. వీటన్నింటిపై సీఐడీతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్‌కు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందు ఉంచడానికి మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

టెండరు వెనుక పెద్ద కుట్ర
‘అర్హతలేని టెరాసాఫ్ట్‌కు ఫైబర్‌ గ్రిడ్‌ టెండరు కట్టబెట్టడం వెనక పెద్ద కుట్రే నడిచింది. టెరాసాఫ్ట్‌ కన్సార్టియం నిబంధనలకు విరుద్ధంగా రెండు ప్రైస్‌బిడ్లు వేశారు. మాకు అన్ని అర్హతలు ఉన్నా పక్కన పెట్టారు. పేస్‌ పవర్‌ సిస్టమ్స్‌ ప్రైవేటే లిమిటెడ్‌ తరఫున నేను టెండర్‌ వేశాను. కానీ, టీడీపీ ప్రభుత్వాన్ని  అడ్డుపెట్టుకుని ఫైబర్‌ గ్రిడ్‌ స్కాంకు పాల్పడింది. టెండరు ఖరారుకు 2 నెలల ముందు బ్లాక్‌లిస్టులో ఉన్న టెరాసాఫ్ట్‌కు దొడ్డిదారిన క్లియరెన్స్‌ ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక పారదర్శకంగా టెండర్లు
ఈ–ప్రొక్యూర్‌మెంట్‌ వేదికగా ఫైబర్‌గ్రిడ్‌ టెండర్లు పిలిచారు. బిడ్డర్‌ తప్పనిసరిగా కంపెనీగా ఉండాలి అనే నిబంధన ఉంది. ఆ కంపెనీకి ఆ రంగంలో కనీసం  మూడేళ్ల అనుభవం ఉండాలి. ఏ కంపెనీ కూడా బ్లాక్‌లిస్ట్‌ అయి ఉండకూడదు. నాలుగు కంపెనీలు టెండర్లు వేశాయి. వీటిలో మూడు కంపెనీలకు అర్హత లేదు. కానీ, ఆ మూడు కలిసి ఒక సంస్థగా ఏర్పడ్డాయి, టెండర్‌ నిబంధనలను ఉల్లంఘించినా వాటిని అనర్హులుగా గుర్తించలేదు. టెరాసాఫ్ట్‌ సంస్థ బ్లాక్‌లిస్టులో ఉంటే పట్టించుకోలేదు. దొడ్డిదారిన బ్లాక్‌లిస్ట్‌ను ఎత్తివేయించుకున్నారు. అదే వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక టెండర్ల విధానాన్ని పూర్తి పారదర్శకంగా ఉంచేందుకు ఏకంగా చట్టం తెచ్చారు. జ్యుడీషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ విధానం ప్రవేశపెట్టారు. 2014–19 వరకూ అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా ఎప్పుడూ కనిపించనేలేదు.

పాత్రధారులు, సూత్రధారులను శిక్షించాలి
నిజానికి.. ఫైబర్‌ గ్రిడ్‌ తొలిదశ ప్రాజెక్టు రూ.329 కోట్లు అని చెప్పారు. ఇదికాక.. సెటాప్‌ బాక్సులు, సీసీ కెమెరాలు, భారత్‌ నెట్‌ ఫేజ్‌–2కు సంబంధించి మూడు టెండర్లను పిలిచి వారికి అనుకూలమైన కంపెనీలకే కట్టబెట్టారు. ప్రాజెక్టు మొదటి దశ టెండర్లలోనే ఇంత స్కామ్‌ జరిగినప్పుడు, మిగిలిన మూడు టెండర్లలో ఎంత కుంభకోణం జరిగిందో ఊహించుకోవచ్చు. ఒక ప్రజాప్రతినిధిగా, బాధ్యతగల పౌరుడిగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్‌గ్రిడ్‌ కుంభకోణంలోని వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకే మీడియా ముందుకు వచ్చాను. ఈ స్కాంపై విచారణ జరుపుతున్న సీఐడీ.. ఇందులో ఉన్న పాత్రధారులు, సూత్రధారులను, అప్పటి అధికారులను, వారి వెనకున్న టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలను కఠినంగా శిక్షించాలి. ఆ రోజు మా కంపెనీకి రావాల్సిన టెండర్లు మాకు దక్కకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎంత దారుణంగా అధికార దుర్వినియోగం చేశారో ప్రజలు అర్ధం చేసుకోవాలి’.  

మరిన్ని వార్తలు