అయోమయంలో రైతులు.. దిగజారుతున్న నిమ్మధరలు

22 May, 2022 09:19 IST|Sakshi
పొదలకూరు యార్డులో నిమ్మకాయలను గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు

పెరిగిన దిగుబడి 

ధరలు తగ్గుతున్న వైనం

పొదలకూరు మండలంలో సుమారు 5 వేల హెక్టార్లలో నిమ్మసాగు

సాక్షి,పొదలకూరు(నెల్లూరు): నిమ్మధరలు రోజురోజుకూ దిగుజారుతున్నాయి. నిమ్మతోటల్లో కాయల దిగుబడి పెరుగుతున్నా ధరలు పతనం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నిమ్మకాయలు అధికంగా యార్డుకు వస్తున్నాయని, ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది రైతులు ఆశించిన స్థాయి కన్నా ధరలు బాగా పెరిగాయి.

ప్రస్తుతం నిమ్మమార్కెట్‌ యార్డులో లూజు(బస్తా) ఒక్కటింటికి రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు ధర పలుకుతోంది. పొదలకూరు మండలంలో సుమారు 5 వేల హెక్టార్లలో రైతులు నిమ్మసాగు చేస్తున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి నుంచి నిమ్మధరలు పెరుగుతుంటాయి. ఈ ఏడాది ఊహించని రీతిలో ధరలు బస్తా రూ.16 వేల వరకు పలికి రికార్డు స్థాయిలో ధరలు నమోదయ్యాయి. 

ధరలు పెరిగినా దిగుబడి లేదు 
ఈ ఏడాది నిమ్మ ధరలు రూ.16 వేలకు పైబడి లూజు(బస్తా) పలికి నెల రోజులపాటు ధరలు నిలకడగా ఉండడం వల్ల వ్యాపారులు, కొందరు రైతులు ఆశించిన స్థాయిలో లబ్ధిపొందారు. అయితే ఎక్కువ మంది రైతుల తోటల్లో సీజన్‌లో కాయల దిగుబడి లేక పోవడం వల్ల ఆదాయం పొందలేకపోయారు. తమ పక్కతోట రైతుకు కాయలు విరగ్గాస్తే తన తోటలో కాయలు లేని విచిత్ర పరిస్థితి ఎదుర్కొన్నామని రైతులు తెలిపారు. ఇపుడు చాలామంది రైతుల తోటల్లో కాయల దిగుబడి పెరిగినా ధరలు రోజురోజుకూ దిగజారుతుండడంతో అయోమయంలో ఉన్నారు. తోటల నుంచి కాయలు యార్డుకు అధిక సంఖ్యలో వస్తుండడంతో వ్యాపారులు ఎగుమతి చేయడం కష్టంగా మారిందంటున్నారు. 

 చదవండి: ప్లీజ్‌... మమ్మల్ని వదిలేయండి, మాకు బతకాలని ఉంది


 

మరిన్ని వార్తలు