తిరుపతిలో ‘ఆపరేషన్​ చిరుత’.. ట్రాప్‌లో మరొకటి.. మూడు నెలల వ్యధిలో ఐదోది

7 Sep, 2023 06:46 IST|Sakshi

తిరుమలల శేషాచలం అడవుల్లో కొనసాగుతున్న ఆపరేషన్‌ చిరుత

మూడు నెలల వ్యవధిలో ఐదు చిరుతల్ని బంధించిన అటవీశాఖ

టీటీడీతో ఫారెస్ట్‌ సిబ్బంది జాయింట్‌ ఆపరేషన్‌

కాలినడక భక్తుల రక్షణ ప్రధానం అంటున్న దేవస్థానం

సాక్షి, తిరుపతి: తిరుమలలో కాలి బాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం TTD, అటవీ శాఖ అధికారులు చేపట్టిన ఆపరేషన్ చిరుత సతల్ఫితాన్ని ఇస్తోంది. తాజాగా మరో చిరుత పులిని బంధించారు అధికారులు. మూడు నెలల వ్యవధిలో బోనులో చిక్కిన ఐదవ చిరుత ఇది.

నరసింహ ఆలయం- ఏడవ మైలు రాయి మధ్య ఏర్పాటు చేసిన ట్రాప్‌లో ఈ చిరుత చిక్కినట్లు అటవీ శాఖఅధికారులు తెలిపారు. నాలుగు రోజుల కిందట ట్రాప్‌ కెమెరాల్లో  దీని సంచారాన్ని అధికారులు గుర్తించి.. బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు నిన్న రాత్రి అది ట్రాప్‌లో చిక్కింది. ఇక కాసేపట్లో అటవీ శాఖ అధికారులతో పాటు టీటీడీ చైర్మన్‌ భూమన చిరుతను బంధించిన ప్రాంతానికి వెళ్తున్నట్లు సమాచారం.

ఇక.. తిరుపతిలో 'ఆపరేషన్​ చిరుత’ కొనసాగుతోంది. తాజాగా చిక్కిన చిరుతతో కలిపి ఐదింటిని అధికారులు బంధించినట్లయ్యింది. మిగిలిన వాటి కోసం అన్వేషణ కొనసాగుతుందని అధికారులు అంటున్నారు.

భద్రతే ప్రధాన ప్రాముఖ్యత..
నడక మార్గంలో గత కొన్నిరోజులుగా చిరుతల సంచారం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. వాటిని ట్రాప్‌ చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. చిన్నారి కౌశిక్‌పై దాడి.. అలాగే చిన్నారి లక్షిత మృతి ఘటనలతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. భక్తుల భద్రతే తమ ప్రధాన ప్రాముఖ్యతగా పేర్కొంటూ.. రక్షణ కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది.

ఈ మేరకు ప్రత్యేక సమావేశాల ద్వారా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కూడా. మరోవైపు టీటీడీ సమన్వయంతో అటవీ శాఖ అధికారులు చిరుతలను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించి.. సక్సెస్‌ అవుతున్నారు. జూన్‌ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28వ తేదీల్లో, తాజాగా.. సెప్టెంబర్‌ 6వ తేదీన చిరుతలు బోనులో పడ్డాయి. 

ఇదీ చదవండి: కర్ర పంపిణీపై విమర్శలు.. స్పందించిన టీటీడీ

మరిన్ని వార్తలు