జగన్‌ సీఎం కంటే నాకేదీ ముఖ్యం కాదు: ఎమ్మెల్యే రాచమల్లు

12 Apr, 2022 12:43 IST|Sakshi

సాక్షి, ప్రొద్దుటూరు: పార్టీ కన్నతల్లిలాంటిదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. తల్లి బాగుంటే ఆమె నీడలో పిల్లలందరూ బాగుంటారన్నారు. స్థానిక జిల్లా ఆస్పత్రిలో సోమవారం ఎమ్మెల్యే రాచమల్లు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మన జిల్లా నుంచి సహోదరుడు అంజద్‌బాషా రెండోసారి మంత్రి వర్గంలో స్థానం పొందడం సంతోషంగా ఉందని తెలిపారు. మంత్రి పదవులు ఆశించిన కొందరు సీనియర్‌ ఎమ్మెల్యేల్లో కొంత నిరాశ, నిస్పృహలు ఉండటం సహజమేనన్నారు.

151 మంది ఎమ్మెల్యేల్లో 26 మందికి మాత్రమే మంత్రి పదవులు వస్తాయన్నారు. అంత మాత్రాన మిగిలిన వారిలో అసంతృప్తి ఉన్నట్లు కాదని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉండటమే తనకు అత్యంత ప్రాధాన్యమైన అంశమన్నారు. జగన్‌ సీఎంగా ఉండటం కంటే తనకు మరే మంత్రి పదవి ముఖ్యం కాదని అన్నారు. తాను జీవించినంత కాలం వైఎస్‌ జగనే సీఎంగా ఉండాలన్నదే తన కోరిక అని తెలిపారు.

చదవండి: (Balineni Srinivas Reddy: జగనన్న మాటే.. వాసన్న బాట) 

ప్రస్తుత మంత్రివర్గంలో అనుభవం, మేథస్సు ఆధారంగా సీనియర్లకు తిరిగి మంత్రి పదవులు దక్కాయన్నారు. కేబినెట్‌ విస్తరణ సందర్భంగా అలకలు అనేవి సాధారణమేనని, అవన్నీ క్రమంగా సర్దుకుపోతాయన్నారు. మంత్రి వర్గంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యత లభించినట్లు ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు