కోవిడ్ చికిత్సకు అధిక ఫీజులు వసూలు
అపరాధ రుసుం విధిస్తూ జేసీ ఉత్తర్వులు
విజయనగరం ఫోర్ట్: కోవిడ్ రోగుల నుంచి కాసుల దోపిడీకి పాల్పడే ప్రైవేటు ఆస్పత్రులకు విజయనగరం జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్కుమార్ కళ్లెం వేశారు. ఇక ముందు ఏ ఆస్పత్రి నిర్వాహకుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించకుండా అధిక మొత్తంలో అపరాధ రుసుం విధించారు. విజయనగరం పట్టణంలోని కర్రల మార్కెట్ రోడ్డులో ఉన్న పీజీ స్టార్ ఆస్పత్రి యాజమాన్యం కోవిడ్ వైద్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తోందంటూ జేసీతో పాటు ఆరోగ్యశ్రీ అధికారులకు ఇటీవల పలువురి నుంచి ఫిర్యాదులు అందాయి. వీటిపై జేసీ, జిల్లా ఆరోగ్యశ్రీ అదనపు సీఈవో మహేష్కుమార్లు విచారణ చేపట్టారు. విచారణలో అధికంగా ఫీజులు వసూలు చేసినట్టు నిర్ధారణ కావడంతో పీజీ స్టార్ ఆస్పత్రికి రూ.10 లక్షల అపరాధ రుసుం విధిస్తూ జేసీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.