సీఎం జగన్‌ న్యూ ఇయర్‌ కానుక.. ఏపీలో పెంచిన పింఛన్ల పంపిణీ

1 Jan, 2023 18:36 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీవ్యాప్తంగా తెల్లవారుజామున నుంచే పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. పెంచిన పెన్షన్ మొత్తం 2,750 రూపాయలు వాలంటీర్లు అందజేస్తున్నారు. మధ్యాహ్నం 12.00 గంటల వరకు 57.88 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. 37.07 లక్షల మందికి రూ.1021.02 కోట్లు అందజేసినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తెలిపారు.

కొత్త సంవత్సరంతో పాటే రాష్ట్రంలో లక్షలాది మంది అవ్వాతాతలు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్య­కారులు, చర్మకారులు, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తుల ఇళ్ల­లో కొత్త వెలుగులు వచ్చేశాయి. ఇప్పటి దాకా.. ప్రతి నెలా వీరు రూ.2,500 చొప్పున అందుకుంటున్న పింఛను డబ్బులు ఈ రోజు నుంచి ప్రతి నెలా రూ.2,750 చొప్పున అందుకుంటున్నారు.

మరోవైపు ఈ నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2,31,989 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 1 నుంచి జరిగే పంపిణీ కార్య­క్రమాన్ని పూర్తి పండుగ వాతావరణంలో వారో­త్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది.

7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మండల, మున్సిపాలిటీల స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వ­హిం­చనుంది. జనవరి 3వ తేదీన సీఎం వైఎస్‌ జగన్‌ రాజమండ్రిలో పింఛను పెంపు వారోత్సవ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన­నున్నారు. 

64.06 లక్షలకు చేరిన పింఛన్ల సంఖ్య
ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన 2,31,989 పింఛన్లతో కలిపి జనవరి నెలలో రాష్ట్రంలో సామా­జిక పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య 64,06,240కి చేరుకుంది. జనవరి ఒకటి ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ.. తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకి వెళ్లి పెరిగిన పింఛను డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఇందుకోసం ప్రభుత్వం శనివారమే అన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖల బ్యాంకు ఖాతాల్లో రూ.1,765 కోట్ల నిధులను జమ చేసింది. 

మండల, మున్సిపాలిటీల వారీగా సమావేశాలు 
► 1వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో స్థానిక ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమాలు మొదలవుతాయి. 7వ తేదీ వరకు స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో విడతల వారీగా అన్ని మండల కేంద్రాలతో పాటు మున్సిపల్, నగర కార్పొరేషన్ల వారీగా ఫించను లబ్ధిదారుల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు స్థానిక ప్రజా ప్రతిని«ధులందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. 

► ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 3వ తేదీ రాజమండ్రిలో పాల్గొనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైతు భరోసా కేంద్రాలు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యక్ష ప్రసారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

► 1వ తేదీ నుంచి పింఛన్ల పెంపు వారోత్సవ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణకు ప్రభుత్వం మండల కేంద్రానికి రూ.10 వేలు, మున్సిపాలిటీకి రూ.15 వేలు, కార్పొరేషన్‌కు రూ.50 వేలు, విజయవాడ, తిరుపతి వంటి పెద్ద కార్పొరేషన్లకు రూ.లక్ష.. విశాఖపట్నం కార్పొరేషన్‌కు రూ.1.50 లక్షలు విడుదల చేసింది. జిల్లా కేంద్రాల్లో స్థానిక మంత్రుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల నిర్వహణకు రూ.20 వేల చొప్పున ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. 

కొత్తగా బియ్యం.. ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాలు 
► పింఛన్లు రూ.2,750కి పెంపుతో పాటు కొ­త్తగా పెన్షన్, బియ్యం కార్డులు, ఆరో­గ్య­శ్రీ కా­ర్డులు, ఇళ్ల పట్టాలను (జూలై 2022 నుంచి నవంబర్‌ 2022 వరకు) అర్హులైన వారికి మంజూరు కార్డులను వా­రో­త్స­వాల్లో ఎమ్మెల్యేలు పంపిణీ చేస్తారు. 

► 44,543 మంది కుటుంబాలకు ప్రభుత్వం కొత్తగా బియ్యం కార్డులు, 14,401 కుటుంబా­లకు కొత్తగా ఆరోగ్యశ్రీ, మరో 14,531 కుటుంబాలకు కొత్తగా ఇళ్ల పట్టా­లను ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. 

► వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన­ప్పటి నుంచి పింఛన్ల కోసం రూ.62,500 కోట్లు ఖర్చు పెట్టారు. లబ్ధిదా­­రుల సంఖ్య తాజాగా 64.06 లక్షలకు పెరిగింది. పెరి­గిన పింఛన్లపై ఏటా రూ. 21,180 కోట్లు ప్రభుత్వం వ్యయం చేయనుంది. 

అప్పటికీ ఇప్పటికీ తేడా..
► చంద్రబాబు ప్రభుత్వంలో రూ.1,000 ఉన్న పింఛన్‌ను జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రూ.2,250కు పెంచడంతో పాటు.. 2022 జనవరిలో రూ.2,500కు, ఈ జనవరి నుంచి రూ.2,750కి పెంచుకుంటూ వచ్చారు. 

► గత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నెల వారీగా పింఛన్ల పంపిణీకి అరకొరగా రూ.400 కోట్ల చొప్పున పంపిణీ చేయగా, 2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే పింఛన్ల వ్యయం ఏకంగా మూడున్నర రెట్లు పెంచి రూ.1,350 కోట్లు ఖర్చు చేసింది. 

► గత చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పింఛన్లు పంపిణీ చేస్తే.. వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక సంతృప్త స్థాయిలో అర్హులందరికీ వంద శాతం పింఛన్ల మంజూరు చేసే విధానం తీసుకొచ్చారు. తద్వారా 2019లో 52.17 లక్షలకు, 2022లో 62.31 లక్షలకు, 2023లో 64.06 లక్షలకు ఆ సంఖ్య చేరుకుంది. 

లంచం, వివక్ష లేకుండా పింఛన్ల మంజూరు
కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీ అనే తారతమ్యాలు లేకుండా.. లంచాలు, వివక్షకు అవకాశం ఇవ్వకుండా అర్హులైతే చాలు ప్రతి ఒక్కరికీ నూటికి నూరు శాతం సంతప్త స్థాయిలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కొత్త పింఛన్లు మంజూరు అవుతున్నాయి. అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కొత్త పింఛన్లకు అర్హులను గుర్తించే పద్దతే ఉండేది కాదు. లంచాలు.. లేదంటే వివక్షే కనిపించేది.

టీడీపీ నేతలతో కూడిన జన్మభూమి కమిటీలే అర్హులను గుర్తించేవి. వాళ్లు లంచాలు ఇస్తేనో లేక తమ వర్గం, తమ పార్టీ వాళ్లో అయితేనే పింఛన్లు మంజూరు చేసేవారు. ఒక్కొక్క గ్రామానికి ఇన్ని పింఛన్లే అని కోటా పెట్టుకొని, ఆ కోటాకు మించి ఎంత మంది అర్హులున్నా వారెవ్వరికీ పింఛన్లు ఇచ్చే వారు కాదు.

మాకు పింఛను అర్హత ఉంది కదా అని ఎవరైనా అడిగితే.. మీ ఊరిలో ఎవరైనా పెన్షనర్‌ చనిపోతే వారి స్థానంలో ఇస్తామని నిస్గిగ్గుగా చెప్పేవారు.  పింఛన్లు తీసుకోవడం కోసం వృద్దులు, దివ్యాంగులు ప్రతి నెలా చాంతాడంత క్యూలో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది.

ఈ ప్రభుత్వం వచ్చాక అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా 1వ తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల డబ్బులు అందజేస్తున్నారు. కొత్త పింఛన్ల మంజూరు కూడా పూర్తి పాదర్శకంగా చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాలను ప్రదర్శించి, సామాజిక తనిఖీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు.  

పేదలకు పెద్దన్న సీఎం జగన్‌ 
కొత్త సంవత్సరం రోజున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పింఛను పెంపు ద్వారా పేదల కళ్లల్లో ఆనందం, ముఖంలో చిరునవ్వు, ఆత్మ గౌరవం తీసుకొచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నవరత్నాల కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

ఏకంగా 64.06 లక్షల మందికి పింఛన్లు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. సీఎం జగన్‌.. తన సంక్షేమాభివృద్ధి పాలన ద్వారా రాష్ట్రంలో పేదలకు పెద్దన్నగా మారారు. ఈ ప్రభుత్వంలో భాగస్వామినైనందుకు గర్వ పడుతున్నాను. 
– బూడి ముత్యాలనాయుడు, ఉప ముఖ్యమంత్రి   

మరిన్ని వార్తలు