డబుల్‌ లేన్లుగా సింగిల్‌ రోడ్లు

7 Jan, 2021 04:33 IST|Sakshi

జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న రోడ్ల అభివృద్ధికి త్వరలో టెండర్లు

ఏడు ప్రాజెక్టులకు డీపీఆర్‌లు ఆమోదించిన కేంద్రం

రూ.2,797 కోట్లతో 440 కి.మీ. మేర రోడ్ల అభివృద్ధి

మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న పలు సింగిల్‌ లేన్‌ రోడ్లు.. డబుల్‌ లేన్లుగా మారనున్నాయి. ట్రాఫిక్‌ అత్యధికంగా ఉండే ఈ రోడ్లను గతంలోనే ఆర్‌ అండ్‌ బీ నుంచి నేషనల్‌ హైవేస్‌ పరిధికి మార్చారు. ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ వీటికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలు(డీపీఆర్‌) రూపొందించింది. వెంటనే ఈ డీపీఆర్‌లను మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ ఆమోదించింది. రూ.2,797 కోట్లతో 440 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్న ఈ రోడ్లకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. ఈ రోడ్లను మూడేళ్లలో పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. 

► చెన్నై–బళ్లారిని కలిపే ఎన్‌హెచ్‌–716లో భాగమైన ఎన్‌హెచ్‌–67(ముద్దనూరు), ఎన్‌హెచ్‌–40(కడప)పై ట్రాఫిక్‌ పెరిగిపోయింది. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాలకు వెళ్లేందుకు ఇది ప్రధాన రహదారి. దీనిపై రోజుకు 9 వేల ప్యాసింజర్‌ కార్‌ యూనిట్‌ (పీసీయూ)ల ట్రాఫిక్‌ ఉంటోంది. ఈ మార్గంలో 51 కి.మీ. మేర రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. 
► ఏజెన్సీ గ్రామాలకు రంపచోడవరం నుంచి కొయ్యూరు (ఎన్‌హెచ్‌–516 ఈ) రోడ్డు ముఖ్యమైనది. ఈ రహదారిలో ఎక్కువ భాగం ఘాట్‌ రోడ్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి సంబంధించి 74 కి.మీ. మేర రోడ్డును అభివృద్ధి చేయనున్నారు. 

► పోరుమామిళ్ల–సీఎస్‌ పురం, సీఎస్‌ పురం–సింగరాయకొండ రోడ్ల అభివృద్ధికి కేంద్రం డీపీఆర్‌లను ఆమోదించింది. ఇవి అందుబాటులోకి వస్తే ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లాలకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే తెలంగాణ–ఏపీని కలిపే జీలుగుమిల్లి– జంగారెడ్డిగూడెం– దేవరపల్లి – రాజమండ్రి రోడ్డుతో పాటు కొవ్వూరు నుంచి అశ్వారావుపేట, ఖమ్మం వరకు రోడ్లను అభివృద్ధి చేయనున్నారు.   

మరిన్ని వార్తలు