ఉక్రెయిన్: ఏపీ విద్యార్థుల కోసం టాస్క్ ఫోర్స్ పనిచేస్తోంది

26 Feb, 2022 18:47 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఉక్రెయిన్‌లో ఉన్న రాష్ట్ర విద్యార్థుల కోసం టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ చైర్మన్‌ ఎం.టీ కృష్ణబాబు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విద్యార్థుల వివరాలను సేకరిస్తున్నామని, ఎవరైనా1902 నంబర్‌కు కాల్ చేసి వివరాలు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. ఇతర దేశాలలో ఉన్నవారి కోసం వాట్సాప్ నెంబర్ అందుబాటులో ఉంచామని తెలిపారు. అన్ని విధాలుగా వివరాలను తెలుసుకుని మాస్టర్ లిస్ట్ తయారు చేశామని చెప్పారు. 212 మంది విద్యార్థుల డేటాను విదేశీ వ్యవహారాల శాఖకు పంపామని అన్నారు. ముంబై, ఢిల్లీకి రెండు విమానాలు వస్తున్నాయని చెప్పారు. ముంబై, ఢిల్లీలో ఏపీ వాళ్ల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఎంత మంది వస్తారన్న దానిపై స్పష్టత రాలేదన్నారు. లిస్ట్‌లో ఉన్నా లేకున్నా అక్కడ రిసీవ్ చేసుకుంటామని అన్నారు. విద్యార్థులను ప్రభుత్వ ఖర్చులతో తీసుకోస్తామని, ముంబై వచ్చేవారిని ట్రావెల్ ఏజెన్సీ ద్వారా తీసుకోస్తామని చెప్పారు. బోర్డర్లకు రావొద్దని ఇప్పుడు చెప్తున్నారని, ఎక్కడ వాళ్లని అక్కడే ఉండాలని సూచిస్తున్నారని తెలిపారు. 300 మందితో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశామని చెప్పారు. వారికి నిరంతరం సూచనలు చేస్తున్నామని, విద్యార్థులు ఎవరు బోర్డర్‌కు రావొద్దని సూచిస్తున్నామని తెలిపారు.

ఏడు యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారని, రుమేనియాకు దగ్గరలో వాళ్లు ఉన్నారని, ఎంబసీ ద్వారా వచ్చే మెసేజ్‌ల ద్వారానే విద్యార్థులు స్పందించాలన్నారు. ఎంత ఖర్చుకైనా వెనకడొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారని ఎం.టీ కృష్ణాబాబు తెలిపారు.

మరిన్ని వార్తలు