అయ్యన్నకు మతిభ్రమించింది

4 Sep, 2022 04:35 IST|Sakshi

టీడీపీ హయాంలో శిలాఫలకాలు తప్ప అభివృద్ధి శూన్యం

నర్సీపట్నం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ ధ్వజం

నర్సీపట్నం: టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు మతిభ్రమించి మాట్లాడుతున్నారని నర్సీపట్నం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సీపట్నం మునిసిపాలిటీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ ప్రభుత్వం రూ.166.89 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టిందన్నారు.

అయితే టీడీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టును తెచ్చామని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టు వచ్చి ఉంటే చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయిందని నిలదీశారు. అయ్యన్నపాత్రుడు తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నర్సీపట్నానికి చేసిందేమీ లేదన్నారు.

గత సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు రూ.56 కోట్ల ప్యాకేజీ–2కి టెండర్లు పిలిచారన్నారు. ఏలేరు నీటిని తీసుకునేందుకు అనుమతులు రాకపోయినా.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పట్లో కేవలం పైపులకు టెండర్లు పిలిచారని మండిపడ్డారు.  

మరిన్ని వార్తలు