గుర్రంకొండ : చిన్నారుల మధ్య చెలరేగిన చిన్నపాటి వివాదం ఓ విద్యార్థి ప్రాణాల మీదికి వచ్చింది. చెల్లెలు ఏవో అన్నమాటలకు మనస్తాపం చెందిన అన్న ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్న సంఘటన మండలంలోని సరిమడుగు పంచాయతీ పుల్లావాండ్లపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మీకాంతం అనే మహిళకు రాయచోటి మాసాపేటకు చెందిన డి.నాగరాజుతో 15 ఏళ్లక్రితం వివాహమైంది. వీరికి శివసాత్విక్ సాయి(13), సంజన(11) అనే పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల నుంచి వీరు విడివిడిగా నివాసముంటున్నారు. శివసాత్విక్ సాయి తన తండ్రి నాగరాజు దగ్గరే ఉంటూ రాయచోటిలో ఎనిమిదవ తరగతి చదువుకొంటున్నాడు. సంజన తన తల్లితో కలసి పుల్లావాండ్లపల్లెలో ఉంటూ చదువుకుంటోంది. అప్పుడప్పుడు శివసాత్విక్ సాయి తల్లి దగ్గరికి వస్తూ పోతూఉండేవాడు. ఈ నేపథ్యంలో దీపావళిని పురస్కరించుకొని శనివారం శివసాత్విక్ సాయి తన తల్లి దగ్గరికి వచ్చాడు. అన్నాచెల్లెలు ఆడుకొంటుండగా.. ఇద్దరి మధ్య చిన్నపాటి వివాదం చెలరేగింది. దీంతో మనస్తాపం చెందిన శివసాత్విక్ సాయి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దిలీప్కుమార్ తెలిపారు.
సిద్దవటం రేంజ్లో
కూంబింగ్
సిద్దవటం : సిద్దవటం రేంజ్ మద్దూరు బీటులోని సమస్యాత్మక ప్రాంతాల్లో శనివారం తమ సిబ్బందితో కూంబింగ్ నిర్వహించామని రేంజర్ బి.కళావతి తెలిపారు. ఎక్కడా స్మగ్లర్ల ఆనవాళ్లు కనిపించలేదని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ సురేష్బాబు, మద్దూరు బీటు అధికారిణి ధీపిక, ఏబీఓ నారాయణరెడ్డి, బేస్ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అక్రమ మద్యం స్వాధీనం
రైల్వేకోడూరు : మండల పరిధిలో అక్రమంగా మద్యం అమ్ముతున్న ఇద్దరిని శనివారం అరెస్ట్ చేసి, 31 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ డాక్టర్ నాయక్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుండాలపల్లిలో అల్లంశెట్టి పెంచలయ్యను అరెస్టు చేసి, అతని వద్ద నుంచి 20 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే గాంధీ నగర్లో షేక్ మస్తాన్ను అదుపులోకి తీసుకుని, 11 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు తరలించారు.