రాయచోటి టౌన్ : ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన పెంచుకోవాలని డీఎంహెచ్వో కొండయ్య అన్నారు. అన్నమయ్య జిల్లాలో హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణపై విద్యార్థులకు అవగాహన కల్పించే క్రమంలో రాయచోటిలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా డీఎంఅండ్హెచ్వో డాక్టర్ కొండయ్య, ఏడీఎంహెచ్వో డాక్టర్ శైలజలు వైద్యసిబ్బందితో కలసి ఈ కార్యక్రమం చేపట్టారు. అంతకు ముందుగా రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు హెచ్ఐవీ /ఎయిడ్స్ వ్యాధుల నియంత్రణపై అవగాహన కల్పించే వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విశేష ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలతోపాటు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఎస్.ఆలీముల్లా, డీఆర్పీ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.