అమ్మ ఒడితో చదువు సాగుతోంది

26 Dec, 2023 03:54 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

అమ్మ ఒడితో చదువు సాగుతోంది
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో మా పాప రామిశెట్టి నాగ గంగా భవాని ఎనిమిదో తరగతి చదువుతోంది. మాది వ్యవసాయ కుటుంబం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. చదివించాలన్న ఆశ ఉన్నా పుస్తకాలకు, దుస్తు­లకు ఖర్చు అవుతుండడంతో కనీసం పదో తర­గతి అయినా చదివించగలనా అనే అనుమానం కలిగేది. ఈ సమ­యంలో అమ్మ ఒడి పథకం రావడంతో చది­వించడానికి ఆధారం దొరికింది. ఈ పథకం కింద ఏటా రూ.15,000 నా ఖాతా­లో జమవుతోంది.

జగనన్న కిట్‌లో భాగంగా మా పాపకు పాఠ్య పుస్త­కాలు, నోట్‌ పుస్తకాలు, షూ, రెండు జతల సాక్స్, బ్యాగ్‌ ఇచ్చారు. ఈ ఏడాది ట్యాబ్‌ ఇస్తా­మని ఉపాధ్యాయులు చెబు­తున్నారు. దీంతో చదువుకు ఇబ్బంది లేకుండా సాగుతోంది. జగ­నన్న ప్రభుత్వంలో ప్రైవేట్‌ పాఠ­­శాలల తరహాలో ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులతోపాటు విద్యకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు.

చదు­వుకు పైసా ఖర్చు లేకుండా ఉండడంతో ఈ చదువులతోపాటు ఉన్నత చదువులు చదివించగలనన్న నమ్మకం ఏర్పడింది. మాది కాకినాడ జిల్లా సామర్లకోట మండలం చంద్రంపాలెం గ్రామం. నా బ్యాంకు ఖాతాలో డ్వాక్రా రుణ మాఫీ మూడు దఫాలుగా రూ.18,000 చొప్పున వచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో ఇంకో విడత మాఫీ సొమ్ము వస్తుందని సచివాలయ అధికారులు చెబుతున్నారు. సర్కారు సాయంతో మా కుటుంబం హాయిగా జీవిస్తోంది.      – రామశెట్టి లోవలక్ష్మి, చంద్రంపాలెం(అడపా వెంకటరావు, విలేకరి, సామర్లకోట)

భరోసా విలువేంటో తెలిసింది..
నేను సన్నకారు రైతును. నాలుగు ఎకరాల భూమి ఉంది. నా భార్య హసీనాబీ. దినసరి కూలీ. ఇద్దరు కుమారులు జుబేర్‌ బాష, నిస్సాన్‌ బాష, కుమార్తె చాంద్‌ బీ సంతానం. పెద్దబ్బాయి ఇంటర్‌ వరకు చదివి, కర్మాగారంలో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. అమ్మ ఒడి సాయం అందుతుండడంతో వీడి చదువుకు బెంగ లేదు. నంద్యాల జిల్లా గడివేముల మండలం బూజు­నూరు గ్రామం. గతంలో సాగు పెట్టుబడి, కుటుంబ పోషణ కోసం నేను అప్పు చేయని సం­వత్సరం లేదు.

ఈ ప్రభుత్వం వచ్చాక నాలు­గేళ్లుగా వివిధ పథకాల ద్వారా ఆర్థిక తోడ్పాటు నా కుటుంబానికి గొప్ప ఊరటనిచ్చింది. ముఖ్యంగా రైతు భరోసా కింద ఏడాదికి రూ.13,500 సాయం ఠంఛనుగా అందుతోంది. అది కూడా ఖరీఫ్, రబీ ప్రారంభంలో అందు­తుండటంతో సేద్యం, విత్తన ఖర్చుల కోసం వడ్డీ వ్యాపారస్తుల్ని ఆశ్రయించాల్సిన అగత్యం తప్పింది. ఇక సున్నా వడ్డీ కింద రూ.లక్ష వ్యవ­సాయ రుణం తీసుకుని పెట్టుబడికి అయ్యే అద­నపు ఖర్చులకు వాడుకుంటున్నాను.

ఇదే లక్ష బయట తెచ్చుకుంటే భారీగా వడ్డీ భరించాల్సి వచ్చేది. సోయాబీన్, మినుము, మొక్కజొన్న, కంది పంటల్ని సాగు చేస్తున్నా. నాణ్యమైన ఎరువుల కోసం రవాణా ఖర్చులు పెట్టుకుని నంద్యాలకు వెళ్లాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ఊళ్లోనే దొరుకుతున్నాయి. గతంలో కరవుతో కష్టాలు ఎదుర్కొన్న మాలాంటి రైతులకు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాకే అసలైన న్యాయం జరిగింది. నా భార్య డ్వాక్రా సంఘంలో సభ్యురాలు. వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రూ.40 వేల రుణం పొందింది. ఇప్పుడు మా కుటుంబం సంతోషంగా ఉంది.    – షేక్‌ చిన్న షాలుమియ్య, బూజునూరు (పి.మోహన్‌రెడ్డి, విలేకరి, నంద్యాల)

ప్రతినెలా రూ.10 వేల పింఛన్‌ వస్తోంది
నా పేరు వెలుగు గోపాల్‌. మాది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సి­పాలిటీ పరిధిలోని కురాకుల తోట గ్రామం. ఏడాదిన్నర క్రితం నా రెండు కిడ్నీలు పాడ­య్యాయి. దీంతో మంచానికే పరిమిత­మ­య్యాను. ఉన్నఫళంగా మంచాన పడటంతో ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. వారానికి మూడు రోజులు అనంతపురంలోని ప్రభుత్వా­సు­పత్రిలో డయాలసిస్‌కు వెళ్తున్నా.

ఇలాంటి సమయంలో మా వార్డు వలంటీర్‌ శివ ఇంటి వద్దకు వచ్చి మీకు నెలకు రూ.10 వేల పింఛన్‌ వస్తుందని దరఖాస్తు చేయించారు. దరఖాస్తు చేసిన రెండు నెలల్లోపే పింఛన్‌ మంజూరైంది. ఇప్పుడు ప్రతినెలా ఒకటో తేదీ మా ఇంటి వద్దకు వచ్చి రూ.10 వేలు నా చేతికి ఇస్తు­న్నారు.

క్లిష్ట పరిస్థితుల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న ఆర్థిక సహాయం నాకు, నా కుటుంబానికి బాసటగా నిలిచింది. నాకు భార్య పార్వతి, ఒక కుమార్తె ఉన్నారు. నా కూతురు నందిని విద్యా దీవెన పథకం ద్వారా చదువుకుంది. ఇటీవలే ఆమెకు వివాహం చేశాం. నా భార్య కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది.   – గోపాల్, కళ్యాణదుర్గం (ఈదుల శ్రీనివాసులు, విలేకరి, కళ్యాణదుర్గం) 

>
మరిన్ని వార్తలు