ఎయిరిండియాలో మరో విడత వీఆర్‌ఎస్‌.. 40 ఏళ్లు దాటితే

17 Mar, 2023 16:21 IST|Sakshi

టాటా స‌న్స్ ఆధీనంలోని ఎయిరిండియా ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నాన్‌ ఫ్లయింగ్‌ విభాగాల్లో విధులు నిర్వహిస్తూ..40 ఏళ్ల వయస్సు నిండి.. వరుసగా 5 ఏళ్ల పాటు సంస్థలో ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన సిబ్బందికి వాలంటరీ రిటైర్మెంట్‌ ఆఫర్‌ (వీఆర్‌ఎస్‌) ఇచ్చింది. ఈ ఆఫర్‌లో అర్హులైన సిబ్బందికి ఎయిరిండియా ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు అందివ్వనుంది. 

పీటీఐ కథనం ప్రకారం.. 
పర్మినెంట్‌ జనరల్‌ కేడర్‌కు చెందిన ఉద్యోగులతో పాటు క్లరికల్‌, నైపుణ్యం లేని కేటగిరీల ఉద్యోగులకు సైతం వాలంటరీ రిటైర్మెంట్‌ ఆఫర్‌లోకి వస్తారని ఎయిరిండియా తెలిపింది. సంస్థ ప్రకటించిన స్వచ్ఛంద విరమణలో సుమారు 2,100 మంది ఉద్యోగులు ఉన్నట్లు పీటీఐ పేర్కొంది.

మాకు కావాలి
ఎయిరిండియా ప్రకటించినట్లుగా సెకండ్‌ ఫేజ్‌ వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌లో అదనపు ప్రయోజనాల్ని ఇతర పర్మినెంట్‌ ఉద్యోగులకు వర్తించేలా చూడాలని సంస్థను కోరుతున్నారు. ఇక రెండవ దశ స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్‌ను ఎయిర్ ఇండియా చీఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ అధికారి సురేష్‌ దత్‌ త్రిపాఠి ప్రకటించారు. 

ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియా ఎంతంటే
మార్చి 17, 2023 నుండి ఏప్రిల్ 30, 2023 వరకు స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు కూడా వన్ టైమ్ బెనిఫిట్‌గా ఎక్స్‌గ్రేషియా మొత్తం అందిస్తున్నట్లు తెలిపారు. మార్చి 31, 2023 వరకు దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన ఉద్యోగులు రూ. 1 లక్షకు పైగా ఎక్స్ గ్రేషియా మొత్తం అందుకుంటారని పేర్కొన్నారు.  కాగా, మొదటి దశలో వాలంటరీ రిటైర్‌మెంట్ ఆఫర్‌లో ఫ్లయింగ్, నాన్ ఫ్లయింగ్ సిబ్బంది ఉన్నారు. వారిలో మొత్తం 4,200 మంది ఉద్యోగులు అర్హులు కాగా, 1,500 మంది మాత్రమే సంస్థ ప్రకటించిన వీఆర్‌ఎస్‌కు అంగీకరించారు.

మరిన్ని వార్తలు