అలెర్ట్‌, దేశ వ్యాప్తంగా ఉద్యోగుల సమ్మె.. బ్యాంక్‌ సేవలపై ఎఫెక్ట్‌!

19 Nov, 2023 09:51 IST|Sakshi

బ్యాంకు ఖాతాదారులకు అలెర్ట్‌. డిసెంబర్‌, జనవరిలో అత్యవసరమైన బ్యాంక్‌ పనులున్నాయా? ఉంటే ఇప్పుడే చూసుకోండి. ప్రైవేట్‌, ప్రభుత్వ రంగ బ్యాంకులు డిసెంబర్‌ 4 నుంచి జనవరి 20 వరకు దేశ వ్యాప్తంగా సమ్మె చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. 

ఆల్‌ ఇండియా బ్యాంక్‌ అసోసియేషన్‌కి చెందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా  ఉద్యోగులు డిసెంబర్‌ 4 నుంచి స్ట్రైక్‌ చేయనున్నట్లు తెలిపారు.   

దేశ వ్యాప్తంగా రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, బ్యాంకుల్లో ఔట్ సోర్సింగ్ నియామకాలకు స్వస్తి పలకాలన్న ప్రధాన డిమాండ్లతో బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు దిగనున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

‘అన్ని బ్యాంకులలో తగినంత సిబ్బందిని నియమించాలి. బ్యాంకుల్లో శాశ్వత ఉద్యోగాల ఔట్‌సోర్సింగ్ లేదా, అవుట్‌ సోర్సింగ్‌కు  సంబంధించిన బీపీ సెటిల్మెంట్ నిబంధనల ఉల్లంఘనను ఆపాలి’ అని అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. 

సమ్మెలో ప్రైవేట్ బ్యాంకులు సైతం 
ప్రభుత్వ బ్యాంకులే కాదు, ప్రైవేట్ బ్యాంకులు సైతం సమ్మెలో పాలు పంచుకోనున్నాయి. దేశ వ్యాప్తంగా డిసెంబర్ 11న సమ్మెకు దిగనుండగా.. జనవరి 19, 20 తేదీలలో స్ట్రైక్‌ చేయనున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకులపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడనుంది. 


 
డిసెంబర్ 4 నుంచి సమ్మె ప్రారంభం
డిసెంబరు 4న ఎస్‌బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్‌ల సమ్మెలతో అఖిల భారత సమ్మె ప్రారంభమవుతుంది. డిసెంబర్ 5, 6, 7, 8, 11 తేదీల్లో వివిధ బ్యాంకులు మూసివేయబడతాయి.     

రాష్ట్రాల వారీగా బ్యాంకుల సమ్మె
అయితే, జనవరి 2 నుండి సమ్మె ఆయా రాష్ట్రాల వారీగా కొనసాగుతుంది. జనవరి 2తో ప్రారంభమైన ఈ స్ట్రైక్‌లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, పుదుచ్చేరి, అండమాన్-నికోబార్, లక్ష్వదీప్‌లోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు పాల్గొననున్నారు. జనవరి 3, 4, 5, 6 తేదీల్లో రాష్ట్రాల వారీగా సమ్మె నిర్వహించనున్నారు. 

యూపీ, ఢిల్లీ బ్యాంకుల సమ్మె
ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలోని బ్యాంకులు వరుసగా జనవరి 4, 5 తేదీలలో మూసివేయబడతాయి.

రెండు రోజుల సమ్మెలో
ప్రభుత్వ, ప్రైవేట్ సహా అన్ని బ్యాంకులు జనవరి 19, 20 తేదీల్లో రెండు రోజుల సమ్మెకు దిగనున్నాయి.

మరిన్ని వార్తలు