సాధారణంగా చాలావరకు ప్రభుత్వ కార్యాలయాలకు రెండో శనివారం, ఆదివారం వరుస సెలవులు ఉంటాయనేది తెలిసిందే కదా. కానీ, ఆ రాష్ట్రంలో మాత్రం ఈ వారంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరో రెండు రోజులు అదనపు సెలవులు ప్రకటించారు. ఎందుకో తెలుసా?..
అస్సాం(అసోం) ప్రభుత్వం ఉద్యోగుల కోసం అరుదైన ప్రకటన చేసింది. జనవరి 6, 7 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రత్యేక సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు ఆదివారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వయంగా వెల్లడించారు. కుటుంబ సభ్యులతో మనసారా గడిపేందుకు ఈ సమయం కేటాయించండంటూ ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు అస్సాం సాధారణ పరిపాలక విభాగం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
జనవరి 6, 7 తేదీల్లో రెండు రోజులపాటు ప్రత్యేక సెలవులు ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తాయి. ఆపై 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం.. కూడా సెలవు దినాలే. అంటే మొత్తం వరుసగా నాలుగు సెలవురోజులు వచ్చాయి. ఇక ప్రత్యేక సెలవుల కోసం ముందుగా ఉద్యోగులు తమ సీనియర్ అధికారులకు లీవ్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సోమవారం(జనవరి 10వ తేదీ) తిరిగి విధుల్లోకి వచ్చేటప్పుడు.. ప్రత్యేక సెలవుల్లో(ఆ రెండురోజులపాటు) కుటుంబంతోనే గడిపినట్లు ఫొటోల్ని ఆధారాలుగా సమర్పించాల్సి ఉంటుంది.
ప్రతీకాత్మక చిత్రం
అంతేకాదు ఈ హాలీడేస్ ఫొటోల్ని ప్రభుత్వం నిర్వహించే పోర్టల్లోనూ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ఆ ప్రత్యేక లీవులు కాస్త క్యాజువల్ లీవులుగా మారిపోతాయి. అంతేకాదు ప్రత్యేక సెలవుల్ని దుర్వినియోగం చేసినందుకు చర్యలు కూడా ఉంటాయి.
To uphold ancient Indian values, I urge Assam Govt employees to spend quality time with their parents/in-laws on Jan 6 & 7, 2022 designated as spl leave.
I request them to rededicate themselves to the cause of building a New Assam & New India with blessings of their parents. pic.twitter.com/hZ2iwbgKoB
— Himanta Biswa Sarma (@himantabiswa) January 2, 2022
టాప్ సివిల్ సర్వెంట్ నుంచి ఫోర్త్ గ్రేడ్ ఉద్యోగుల దాకా.. అందరికీ ఈ సెలవులు వర్తిస్తాయి. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. తల్లిదండ్రులు లేని ఉద్యోగులకు ఈ సెలవుల నిబంధన వర్తించదు. అలాగే ఆ లీవ్స్ను తర్వాత ఉపయోగించుకోవడానికి కూడా వీల్లేదు. ఉద్యోగులు తమ కుటుంబీకులతో సమయం గడిపేందుకు అవకాశం ఇచ్చిన హిమంత సర్కార్పై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి. నవంబర్లోనే ఈ జీవోకు అస్సాం ప్రభుత్వం ఆమోదం తెలిపింది.