శివిందర్‌ సింగ్‌ బ్యాంక్, డీమ్యాట్‌ ఖాతాలు స్వాధీనం

25 Jan, 2023 13:06 IST|Sakshi

న్యూఢిల్లీ: రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌ నిధుల మళ్లింపు కేసులో మాజీ ప్రమోటర్‌ శివిందర్‌ మోహన్‌ సింగ్, నాలుగు సంస్థలకు చెందిన బ్యాంక్, డీమ్యాట్‌ ఖాతాలను స్వాధీనం చేసుకోవాలని సెబీ ఆదేశించింది. వీరి నుంచి జరిమానా వసూలు చేసుకోవాల్సి ఉండడంతో ఈ ఆదేశాలు జారీ చేసింది. 

రెలిగేర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సబ్సిడరీయే రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్‌. శివిందర్‌ మోహన్‌ సింగ్, మలవ్‌ హోల్డింగ్స్, ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, ఏఎన్‌ఆర్‌ సెక్యూరిటీస్, రెలిగేర్‌ కార్పొరేట్‌ సర్వీసెస్‌కు సంబంధించి ఎలాంటి డెబిట్‌ లావాదేవీలను అనుమతించొద్దని అన్ని బ్యాంకులు, డిపాజిటరీలను సెబీ ఆదేశించింది. వీరికి సంబంధించి అన్ని ఖాతాలు, లాకర్లను అటాచ్‌ చేయాలని కోరింది. 

నిధులు మళ్లించిన కేసులో రూ.48 కోట్లను చెల్లించాలంటే ఈ నెల మొదట్లో రెలిగేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ మాజీ ప్రమోటర్లు మాల్విందర్‌ మోహన్‌ సింగ్, శివిందర్‌ మోహన్‌ సింగ్‌లను సెబీ ఆదేశించం గమనార్హం. ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్, మలవ్‌ హోల్డింగ్స్‌ అన్నవి రెలిగేర్‌ ఎంట్ర్‌ప్రైజెస్‌ మాజీ ప్రమోటర్‌ సంస్థలు. ఏఆర్‌ఆర్‌ సెక్యూరిటీస్, రెలిగేర్‌ కార్పొరేట్‌ సర్వీసెస్‌ అన్నవి ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్‌కు సబ్సిడరీలుగా ఉన్నాయి.   
 

మరిన్ని వార్తలు