Rice Price Hike In India: బాస్మతియేతర బియ్యం ధరల నియంత్రణకు చర్యలు

19 Dec, 2023 12:32 IST|Sakshi

భారతదేశంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా బియ్యం పరిశ్రమలకు కఠినమైన ఆదేశాలను జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

గత కొంతకాలంగా దేశీయ మార్కెట్లో బాస్మతియేతర బియ్యం ధరలు వేగంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ 'సంజీవ్ చోప్రా' (Sanjeev Chopra) ప్రముఖ రైస్ ప్రాసెసింగ్ పరిశ్రమ ప్రతినిధులతో ఇటీవలే సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో సంజీవ్ చోప్రా మాట్లాడుతూ.. బాస్మతియేతర బియ్యం ధరలు సజావుగా (రీజనబుల్) ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో ఉన్న నాణ్యమైన బియ్యాన్ని ఓపెన్ మార్కెట్ సేల్స్ స్కీమ్ కింద 29 రూపాయలకే ప్రాసెసర్లకు అందజేస్తున్నారు. అయితే ఇదే బియ్యాన్ని వారు మార్కెట్లో రూ.43 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారని, దీనిని దృష్టిలో ఉంచుకుని ఆదేశాలను జారీ చేయడం జరిగిందని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. గత జులైలో బియ్యం ధరలను తగ్గించడానికి ప్రభుత్వం బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అంతే కాకుండా ఎగుమతి సుంకాలను సుమారు 20 శాతం వరకు పెంచింది. ఇవన్నీ దేశంలో బియ్యం కొరత రాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త అని తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు