తగ్గిన ‘తీపి’ ఉత్పత్తి..! కారణాలు ఇవే..

19 Dec, 2023 16:55 IST|Sakshi

దేశవ్యాప్తంగా గతంలో నెలకొన్న ఎల్‌నినో, వర్షాల ప్రభావం చక్కెర(షుగర్‌) ఇండస్ట్రీపై పడింది. ప్రస్తుతం చక్కెర ఉత్పత్తి తగ్గుతోంది.

ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ 1–డిసెంబర్‌‌‌‌ 15 మధ్య ఉత్పత్తి అయిన చక్కెర‌‌‌‌  గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 11 శాతం తగ్గి 74.05 లక్షల టన్నులుగా రికార్డయ్యింది. గతేడాది ఇదే సమయంలో 82.05 లక్షల టన్నుల చక్కెర ఉత్పత్తి అయింది. సాధారణంగా షుగర్‌‌ మార్కెటింగ్ అక్టోబర్ నుంచి సెప్టెంబర్‌‌‌‌ వరకు గరిష్ఠంగా ఉంటుంది. 

గతేడాది ఉన్న 497 ఫ్యాక్టరీలు ఈ ఏడాదీ ఉత్పత్తి ప్రారంభించాయి. వీటిలో ఎటువంటి మార్పు లేదని ఇండియన్ షుగర్​ మిల్స్ అసోసియేషన్ (ఇస్మా) పేర్కొంది. కానీ మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ఫ్యాక్టరీలు 10–15 రోజులు లేటుగా ప్రొడక్షన్ ప్రారంభించినట్లు వివరించింది. ఉత్తర్‌ప్రదేశ్‌‌లో చక్కెర ఉత్పత్తి అక్టోబర్ 1–డిసెంబర్ 15 మధ్య 22.11 లక్షల టన్నులుగా నమోదయ్యింది. గతేడాది మార్కెటింగ్‌‌ ఇయర్‌‌‌‌లో ఇదే సమయానికి 20.26 లక్షల టన్నుల చక్కెర‌‌‌‌ను ఉత్పత్తి చేసింది.

మహారాష్ట్రలో అయితే చక్కెర ఉత్పత్తి 33.02 లక్షల టన్నుల నుంచి 24.45 లక్షల టన్నులకు తగ్గింది. కర్ణాటకలో 19.20 లక్షల టన్నుల నుంచి 16.95 లక్షల టన్నులకు పడిపోయింది. చెరుకును చక్కర ఉత్పత్తితోపాటు ఇథనాల్‌‌ ప్రొడక్షన్‌కు వినియోగిస్తున్నారు. అయితే చెరుకును ఇథనాల్‌ కోసం వాడకపోతే ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్‌‌‌‌లో 325 లక్షల టన్నుల చక్కెర‌‌‌‌ ఉత్పత్తి అవుతుందని ఇస్మా అంచనా వేస్తోంది.

ఇదీ చదవండి: వీటిని తెగవాడుతున్నారు..!

దేశవ్యాప్తంగా డిస్టిలరీ ప్రాజెక్టులు ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం విస్తరణ ప్లాంట్లలో దాదాపు రూ.35,000 కోట్లు పెట్టుబడి పెట్టాయి. మరోవైపు ఎల్ నినో, వర్షాల ప్రభావంతో దేశవ్యాప్తంగా చెరుకు ఉత్పత్తిలో అగ్రగామి రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటకల్లో ఉత్పత్తిపై ప్రభావం పడినట్లు నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్(ఎన్‌ఎఫ్‌సీఎస్‌ఎఫ్‌) తెలిపింది. దేశంలో చక్కెర ధరలను కంట్రోల్ చేసేందుకు సప్లయ్‌‌ సమస్యలు లేకుండా చూసేందుకు ప్రస్తుత మార్కెటింగ్ ఇయర్‌‌‌‌లో ప్రభుత్వం ఎగుమతులను నిలిపేసింది.

>
మరిన్ని వార్తలు