ముంబై : ఒమిక్రాన్ వైరస్ దేశాన్ని చుట్టేస్తోంది. క్రమంగా కఠిన ఆంక్షలు ఒక్కో రాష్ట్రంలో అమల్లోకి వస్తున్నాయి. ప్రతికూలతలు చుట్టు ముట్టినా ఈ ఏడాది ఆరంభం నుంచి స్టాక్ మార్కెట్ లాభాల బాటలోనే ఉంది. బుధవారం సైతం అదే ట్రెండ్ కనిపిస్తోంది. దేశీ సూచీలు జోరుగా లాభాల్లోకి వెళ్లకున్నా.. నష్టాల దిశగా అయితే వెళ్లలేదు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నా.. ప్రతికూల పరిస్థితులు బ్రేకులు వేస్తున్నాయి. ఫలితంగా మార్కెట్లో వేచి చూసే ధోరణి కనిపిస్తోంది.
ఈ రోజు ఉదయం 9:15 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 59,921 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. 60 వేల పాయింట్ల మైలు రాయిని ఈ రోజు క్రాస్ చేస్తుందా లేక ఒమిక్రాన్ ఎఫెక్ట్తో మరోసారి నేల చూపు చూస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే 15 పాయింట్లు లాభపడి 17,820 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.