ట్విటర్‌కు షాక్‌: లక్షలకొద్దీ కొత్త యూజర్లతో ప్రత్యర్థులకు పండగ

7 Nov, 2022 15:14 IST|Sakshi

న్యూఢిల్లీ:  టెస్లా  చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ను ట్విటర్‌ను కొనుగోలు చేసిన తరువాత అనేక పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా యూజర్లు ట్విటర్‌కు గుడ్‌ బై చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారట. ప్రత్యామ్నాయాలను ప్లాట్‌ఫారమ్‌ వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రత్యర్థి ప్లాట్‌ఫామ్స్‌కు కలిసి వస్తోందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా  మాస్టోడాన్‌కు  లక్షలమంది కొత్త వినియోగదారులు జత అవుతున్నారు. 

మాస్టోడాన్  ఆవిష్కారం ఎపుడు? 
దాదాపు ట్విటర్‌లానే పనిచేసే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ మాస్టోడాన్.  2016లో యూజెన్ రోచ్కోచే  దీన్ని స్థాపించారు. ద్వేషపూరిత ప్రసంగాలను, పోస్ట్‌లను నియంత్రిస్తూ స్వీయ-హోస్ట్ సోషల్ నెట్‌వర్కింగ్‌ సేవలందించే ఉచిత ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్. అయితే ట్విటర్‌ టేకోవర్‌ తరువాత నెలకొన్న గందరగోళం నేపథ్యంలో జర్నలిస్టులు, నటులతోపాటు, ఇతర సెలబ్రిటీలు మాస్టోడాన్‌కి షిప్ట్‌ అవుతున్నారట. ముఖ్యంగా జర్నలిస్ట్ మోలీ జోంగ్-ఫాస్ట్ నటుడు,  హాస్యనటుడు కాథీ గ్రిఫిన్  ఇప్పటికే మాస్టోడాన్‌కు మారిపోయారు.

మాస్టోడాన్ వ్యవస్థాపకుడు, సీఈవో ట్వీట్‌ ప్రకారం ఈ ప్లాట్‌ఫారమ్‌లో అంతకుముందెన్నడూ లేని విధంగా యూజర్లు పెరిగారు. ప్రస్తుతం మాస్టోడాన్‌కు 6,55,000 మంది నెలవారీ వినియోగ దారులుండగా, అక్టోబర్‌ 27న మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేసిన గత వారం రోజుల్లో  230,000 మందికి పైగా  కొత్త యూజర్లు చేరారు. మరోవైపు తన ఫోటో, పేరుతో  కామెడీ ఖాతా తెరిచిన నటి కాథీ గ్రిఫిన్‌ ట్విటర్‌  ఖాతాను బ్యాన్‌  చేశారు మస్క్‌. 

బ్లూస్కీ సోషల్‌: ట్విటర్‌ ఫౌండర్‌, మాజీ  సీఈవో జాక్ డోర్సే గత వారం లాంచ్‌ చేసిన కొత్త బ్లాక్‌చెయిన్ ఆధారిత సోషల్ మీడియా బ్లూస్కీ సోషల్‌లో  రెండు రోజుల్లోనే  30,000 మందికి పైగా సైన్ అప్  చేశారు. మస్క్‌-ట్విటర్‌ డీల్‌ తరువాత  ప్రత్యామ్నాయంగా ఈ యాప్‌వైపు మొగ్గు తున్నారు యూజర్లు.

కూ: ఇండియాకుచెందిన బహుళ-భాషా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ యాప్‌ ఇటీవల 50 మిలియన్ల డౌన్‌లోడ్‌లను దాటేసింది. యాప్ ఈ సంవత్సరం ప్రారంభం నుండి వినియోగదారులు, గడిపిన సమయం, ఎంగేజ్‌మెంట్‌లో  భారీ పెరుగుదలను సాధించింది. 2020లో ప్రారంభించిన  ఈ యాప్ 10 భాషల్లో అందుబాటులో ఉంది. ఇండియాలో  దాదాపు అన్ని ప్రభుత్వరంగ శాఖలు, ఉన్నతా ధికారులు ప్రభుత్వరంగ ఉద్యోగులు,  కూ యాప్‌లో నమోదై ఉండటం గమనార్హం. 

మరిన్ని వార్తలు