సెమీకండక్టర్ల కొరత.. భారీగా పడిపోయిన కార్ల అమ్మకాలు!

31 Jan, 2022 19:16 IST|Sakshi

సెమీకండక్టర్ల కొరత కారణంగా కార్ల తయారీ కంపెనీలు డిసెంబర్ 2021 నాటికి 7 లక్షల కార్లను సమయానికి అందించలేక పోయినట్లు నేడు కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వే 2021-22 తెలిపింది. సరఫరాలో ఆలస్యం కారణంగా 2021లో వాహన డెలివరీ సగటు సమయం(ఆర్డర్ తేదీ నుంచి డెలివరీ చేయడానికి గల మధ్య అంతరం) సుమారు 14 వారాలుకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ ఎకనామిక్ సర్వే 2021-22లో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కూడా ఇదే విషయాన్ని హైలైట్ చేసింది. 

2021 డిసెంబరులో కార్ల తయారీదారులు దేశీయ మార్కెట్లో 2,19,421 ప్యాసింజర్ వాహనాలను విక్రయించారని, ఇది 2020తో పోలిస్తే అమ్మకాలు 13% తగ్గిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్(సీఐఏఎమ్) నివేదించింది. దేశంలో సెమీకండక్టర్ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఎకనామిక్ సర్వే తెలిపింది. సెమీకండక్టర్, డిస్ ప్లే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.76,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సెమీకండక్టర్ల కొరతకు కారణమవుతున్న సమయంలో ఈ పరిశ్రమను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వ జోక్యం చేసుకోవాల్సి వచ్చినట్లు సర్వే తెలిపింది. సరఫరా గొలుసుల్లో విచ్ఛిన్నం కారణంగా అనేక విభిన్న పరిశ్రమలకు చెందిన కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం లేదా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు నివేదిక తెలిపింది.

(చదవండి: దేశంలోనే తొలి 3డీ గృహం.. 21 రోజుల్లో నిర్మాణం.. ఆనంద్ మహీంద్రా ఆసక్తి!)

మరిన్ని వార్తలు